మధ్యాహ్న భోజనం అందుతోందా?

ABN , First Publish Date - 2022-08-06T19:42:54+05:30 IST

విద్యార్థుల(students)కు మధ్యాహ్న భోజనం సరిగా అందుతోందా? రుచి బాగుంటోందా? వారానికి మూడు రోజులు గుడ్డు ఇస్తున్నారా? వంట గదిని శుభ్రంగా

మధ్యాహ్న భోజనం అందుతోందా?

రుచి బాగుంటోందా? గుడ్డు ఇస్తున్నారా?.. 

డీఈవోలను నివే దిక కోరిన ప్రభుత్వం

12లోగా సమర్పించాలని ఆదేశం..

ఇటీవలి ఘటనలతో పరిశీలనకు నిర్ణయం


హైదరాబాద్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల(students)కు మధ్యాహ్న భోజనం సరిగా అందుతోందా? రుచి బాగుంటోందా? వారానికి మూడు రోజులు గుడ్డు ఇస్తున్నారా? వంట గదిని శుభ్రంగా ఉంచుతున్నారా? తదితర విషయాలపై పూర్తి సమాచారం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పాఠశాలలను తనిఖీ చేసి నివేదిక అందజేయాలని జిల్లా విద్యాధికారు (డీఈవో)లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీలోగా నివేదిక సమర్పించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సర్కారు పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం(lunch) అమలు చేస్తున్నారు. విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఉడికించిన గుడ్డు అందించాల్సి ఉంటుంది. అయితే, ఈ పథకం అమలులో చాలా పాఠశాలల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సరైన నాణ్యత పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వంట గది శుభ్రంగా లేకపోవడం, నాసిరకం సరుకులు, ప్రభుత్వం నుంచి బియ్యం సరఫరాలోనూ కొన్నిసార్లు సమస్యలు వస్తున్నాయి. ఇటీవల బాసర ట్రిపుల్‌ ఐటీలో మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.


మరికొన్నిచోట్ల కూడా విద్యార్థులు ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్న భోజన పథకంపై సమాచారం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లోని పరిస్థితిపై ప్రత్యేక నివేదిక అందించాలని ఉన్నతాధికారులు డీఈవోలను ఆదేశించారు.  పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, అందుకుతగ్గట్లుగా మధ్యాహ్న భోజన ఏర్పాట్లు ఉన్నాయా? లేవా?, బియ్యం నాణ్యంగా ఉన్నాయా? ఇతర ఆహార వస్తువులు ఉన్నాయా? బిల్లులను చెల్లిస్తున్నారా? ప్రధానోపాధ్యాయుడు రోజూ పరిశీలిస్తున్నారా? తదితర అంశాలపై నివేదిక అందించాలని నిర్దేశించారు.

Updated Date - 2022-08-06T19:42:54+05:30 IST