కంగన మద్దతుదారులపై సంజయ్ బ్లాస్టింగ్ కామెంట్స్!

ABN , First Publish Date - 2020-10-01T01:41:12+05:30 IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇటీవల వార్తల్లో నిలిచిన శివసేన...

కంగన మద్దతుదారులపై సంజయ్ బ్లాస్టింగ్ కామెంట్స్!

ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇటీవల వార్తల్లో నిలిచిన శివసేన నేత, ఎంపీ సంజయ్ రావత్ ఈ సారి ఆమె మద్దతుదారులపై గురిపెట్టారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన మానవ మృగాలపై ఎందుకు నోరెత్తడం లేదంటూ ఆయన విరుచుకుపడ్డారు. హత్రాస్ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ... ‘‘సెలబ్రిటీలు, హీరోయిన్లకే న్యాయం కావాలా? ఓ హీరోయిన్ ఇంటి పైకప్పు తొలగించడంపై నానా యాగీ చేసిన మీడియా ఇప్పుడేమైంది? ఆమె తరపున తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కిన ఆయా వర్గాలు ఏమయ్యాయి?’’ అని ప్రశ్నించారు. హత్రాస్ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందనీ.. ఇది అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. దీనిపై దళిత నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడకపోవడం దారుణమన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ఏదీ తనకు కనిపించలేదని రావత్ పేర్కొన్నారు.


ఈ నెల 14న హత్రాస్‌లోని ఓ గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, తీవ్రంగా గాయపర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే మంగళవారం ఆమె కన్నుమూసింది. కాగా ఈ ఘటనపై దళితనేత రాందాస్ అథవాలే పైనా రావత్ మండిపడ్డారు. ‘‘కేంద్ర మంత్రి, ఆర్పీఐ చీఫ్ రాందాస్ అథవాలే ఓ హీరోయిన్‌కి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. కానీ హత్రాస్‌కి చెందిన ఓ నిరుపేద బాలిక విషయంలో మాత్రం నోరెత్తలేదు. ఆమెను కడసారి చూసుకునేందుకు కూడా బాధిత కుటుంబం నోచుకోలేకపోయింది..’’ అని దుయ్యబట్టారు. 

Updated Date - 2020-10-01T01:41:12+05:30 IST