శిక్ష పడిన నేతలపై జీవితకాల నిషేధం విధించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందా? సుప్రీం ప్రశ్న

ABN , First Publish Date - 2021-11-25T16:24:54+05:30 IST

నేరం రుజువై శిక్ష పడిన నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాల నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది....

శిక్ష పడిన నేతలపై జీవితకాల నిషేధం విధించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందా? సుప్రీం ప్రశ్న

న్యూఢిల్లీ : నేరం రుజువై శిక్ష పడిన నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాల నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది,పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం అభిప్రాయాన్ని తెలియజేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజును సుప్రీం కోరింది.‘‘సుప్రీంకోర్టు కేంద్రం అభిప్రాయాన్ని కోరి దాదాపు 15 నెలలైంది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే తప్ప చట్టాన్ని రూపొందించడం లేదా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించడం కుదరదు.దీని కోసం ఎన్నికల కమిషన్‌ను సంప్రదించాలి, ఈ న్యాయస్థానం సమస్యను నిర్ణయించడం అంత సులభం కాదు. శాసన మార్గాన్ని అనుసరించాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి’’ అని  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం చెప్పింది.


ఘోరమైన నేరంలో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తి జీవితాంతం కానిస్టేబుల్ పదవికి కూడా అనర్హుడని ఉపాధ్యాయ్ వాదించారు. ‘‘కానీ అదే విధంగా దోషిగా తేలిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి, హోం మంత్రిగా ఉండటానికి అనర్హుడని ’’ ఉపాధ్యాయ్ వాదించారు. ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్‌లను సుప్రీం బెంచ్ ప్రస్తావిస్తూ, ‘‘మీరు ఎన్ని పిల్‌లు దాఖలు చేశారు?’’ అని ప్రశ్నించింది.సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటి విచారణలను వేగవంతం చేయడానికి 2018 నుంచి సుప్రీం బెంచ్ పలు ఆదేశాలు జారీ చేసింది.


Updated Date - 2021-11-25T16:24:54+05:30 IST