ఉపాధి మాట ఉత్తదేనా?
ABN , First Publish Date - 2021-12-07T05:05:21+05:30 IST
హైదరాబాద్ నగరానికి శివారు గ్రామంగా ఉన్న
- స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వని ఆదిభట్లలోని భారీ పరిశ్రమలు
- నెరవేరని గత హామీలు.. కేటీఆర్ రాకతోనైనా యువత ఆశ నెరవేరేనా?
- ఐటీ శాఖ మంత్రి ఆదేశాల కోసం ఎదురుచూపులు
ఆదిభట్ల : హైదరాబాద్ నగరానికి శివారు గ్రామంగా ఉన్న ఆదిభట్ల టీసీఎస్ లాంటి ఐటీ సంస్థల రాకతో ప్రాచుర్యంలోకి వచ్చింది. టీసీఎస్తోపాటు టాటా అడ్వాన్స్ సిస్టమ్, టాటా లాక్డ్ మార్టిన్ లాంటి సంస్థలతోపాటు అమెరి కాకు చెందిన బోయింగ్తో కలిసి టాటా సంస్థ సంయుక్తంగా తయారు చేస్తున్న అపాచీ ఏహెచ్ 64 హెలికాఫ్టర్ల విడిభాగాల ఉత్పత్తు లను అమెరికాకు ఎగుమతులు చేస్తుండటంతో ఆదిభట్లకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతైతే దక్కింది. కానీ ఇక్కడ సంస్థలలో స్థానికులకు ఉద్యోగావకాశాలు రాక అనేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములు ప్రభుత్వానికి ఇచ్చిన రైతులు తమ పిల్లలకు కనీసం ఉపాధి కల్పించకపోవ డంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.
40వేలకు పైగా ఉద్యోగాలు ఉన్నా స్థానికులు వెయ్యిలోపే..
ఆదిభట్ల పారిశ్రామిక వాడలో దాదాపు పదికిపైగా ఉన్న వివిధ సంస్థల్లో నలబై వేలకు పైగా ఉద్యోగాలున్నాయి. కానీ స్థానికులకు మాత్రం వెయ్యి మందికి కూడా ఉద్యోగావ కాశాలు ఇవ్వకపోవడం విచారకరమని ఇక్కడి యువకులు వాపోతున్నారు. ఇందులో అధిక శాతం వివిధ రాష్ర్టాలకు చెందిన వ్యక్తులు పని చేయడం గమనార్హం. కోట్ల రూపాయల విలువ చేసే భూములు ప్రభుత్వానికి ఇచ్చిన స్థాని కులకు ఉపాధి అవకాశాలు ఇవ్వకపోవడంతో ఈ ప్రాంత యువత నిరాశకు లోనవుతోంది.
నీటిమీది రాతలుగా మంత్రి కేటీఆర్ హామీలు
ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పిస్తామంటూ ఎన్నికల్లో ప్రచారంలో నేతలు ఇచ్చే హామీలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. ఇదేవిషయం 2018లో టాటా బోయింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. అంతేకాకుండా పరిశ్రమల్లో స్థానికులకు కచ్చితంగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరడం లేదు.
ఈ సారైనా నెరవేరేనా?
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధికారిక పర్యటనలో భాగంగా మంగళవారం ఆదిభట్లకు రానున్నారు. టాటా సిస్టమ్స్, లాక్డ్ మార్టిన్ సంయుక్తంగా మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేసిన ఎఫ్ 16 వింగ్స్ను ప్రారం భించేందుకు కేటీఆర్ మంగళవారం ఆదిభట్లకు వస్తున్నారు. ఇప్పుడైనా స్థానికుల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారా..? లేదా ఎప్పటిలాగే ప్రకటనలకే పరిమితం అవుతారా అని ఈ ప్రాంత యువత ఎదురుచూస్తుంది.
స్థానికులకు ఉద్యోగాల సంగతేంది..?
ఆదిభట్ల పారిశ్రామిక వాడలో సంస్థల ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు కోట్లాది రూపాయల విలువ చేసే భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంతటి త్యాగం చేసిన ఈ ప్రాంతం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం అన్యాయం. పరిశ్రమల్లో వేలాది ఉద్యోగాలు ఉన్నా స్థానికులకు ఇవ్వడం లేదు. స్థానిక కోటా కింద ఇక్కడి వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించి ఆయా సంస్థలను ఆదేశించాలి.
- పండాల లక్ష్మీపతిగౌడ్, బీజేపీ గీతాసెల్ జిల్లా కన్వీనర్