ఇరిగేషన్, అభివృద్ధిపైనే దృష్టి!
ABN , First Publish Date - 2021-03-08T08:29:48+05:30 IST
వచ్చే బడ్జెట్లో ముఖ్యమైన రంగాలతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
- సంక్షేమ పథకాలకూ అధిక ప్రాధాన్యం
- బడ్జెట్పై నేటి నుంచి మంత్రి హరీశ్ భేటీలు
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): వచ్చే బడ్జెట్లో ముఖ్యమైన రంగాలతోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది రాబడి బాగానే ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక రంగాలకు నిధుల కేటాయింపులు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు 2021-22 బడ్జెట్పై సీఎం కేసీఆర్ శనివారం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా సోమవారం నుంచి అధికారులతో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సమావేశాలు నిర్వహించనున్నారు. బడ్జెట్ రూపకల్పన సందర్భంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులతోపాటు, పన్నులు, ఇతర రాబడులపై అధికారులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు తెలిసింది. వాస్తవానికి రాష్ట్రానికి సమకూరే ఆదాయంలో... సుమారు 75 శాతం సొంత వనరుల నుంచే వస్తుండగా, కేంద్రం నుంచి కేవలం 25శాతం ఆదాయమే వస్తోంది. వచ్చే ఏడాది సైతం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండగా.. దీన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లో ఆయా రంగాలకు కేటాయింపులు చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరలో మూడవ టీఎంసీ నీటి ఎత్తిపోతలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకు భారీగానే నిధులు కేటాయించాల్సి ఉంటుంది.
ఇక, రైతు బంధు, రైతు బీమా సహా పలు సంక్షేమ పథకాలతోపాటు పలు అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులపై మంత్రి హరీశ్ సమీక్షించే అవకాశం ఉంది. కాగా, కొన్ని నెలల ముందుతో పోలిస్తే.... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉంది. మొత్తంగా చూస్తే జనవరి నాటికి రూ.1,76,393కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. రూ.1,18,977కోట్లే వచ్చింది. అదే సమయంలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 11,764 కోట్లు వచ్చాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 2021-22 బడ్జెట్ను రూపొందించే అవకాశం ఉంది.