సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం
ABN , First Publish Date - 2021-06-18T06:26:37+05:30 IST
సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచి వేస్తామని అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు హెచ్చరించారు.
10 రక్షక్, 12 బ్లూకోల్ట్స్ బృందాల ఏర్పాటు: ఎస్పీ
తిరుపతి(నేరవిభాగం), జూన్ 17: సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచి వేస్తామని అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు హెచ్చరించారు. ప్రజలకు భద్రత కల్పించి, అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడానికి 60 మంది సిబ్బందితో 10 రక్షక్, 12 బ్లూకోల్స్ట్ బృందాలను ఎస్పీ ఏర్పాటు చేశారు. స్థానిక ఏఆర్ పోలీసు పరేడ్ మైదానంలో బ్లూకోల్స్ట్, రక్షక్ సిబ్బందికి రెండ్రోజులపాటు ఇచ్చిన శిక్షణ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపాలన్న ఉద్దేశంతో ప్రత్యేక రక్షక్, బ్లూకోల్స్ట్ దళాలను ఏర్పాటు చేసిట్టు వెల్లడించారు. ఈ దళాలు నిరంతరం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం అనుసంధానమై పనిచేస్తాయని చెప్పారు. ప్రతి వాహనంలో ఒక హెడ్కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారని వివరించారు. అత్యవసర సమాచారం అందిన వెంటనే సిబ్బంది తక్షణం స్పందించి, బాఽధితులకు రక్షణ కల్పించాలని సూచించారు. అలక్ష్యం వహిస్తే సహించేది ఉండదని హెచ్చరించారు. ముఖ్యంగా యువత చెడుమార్గంలో నడవకుండా చైతన్యపరిచేలా వ్యవహరించాలన్నారు. పరిపాలనా విభాగం అదనపు ఎస్పీ సుప్రజ, తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ ఆరీఫుల్లా, డీఎస్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.