ఇరాన్లో కొత్త ఆశలు.. కోలుకుంటున్న కరోనా రోగులు
ABN , First Publish Date - 2020-04-11T02:10:30+05:30 IST
ఇరాన్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా మహమ్మారి బారినపడిన వారిలో సగం మందికిపైగా కోలుకోవడం
టెహ్రాన్: ఇరాన్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా మహమ్మారి బారినపడిన వారిలో సగం మందికిపైగా కోలుకోవడం ప్రజల్లో సంతోషాన్ని నింపుతోంది. దేశంలో అదృష్టవశాత్తు కరోనా రోగులు కోలుకుంటున్నారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కియానుష్ జహాన్పూర్ పేర్కొన్నారు. ఈ వైరస్ బారినపడిన వారిలో సగం మందికిపైగా కోలుకున్నారని ఆయన తెలిపారు. ఇరాన్లో ఇప్పటి వరకు 68,192 మంది కరోనా బారినపడగా, 35,465 మంది కోలుకున్నారు. అంటే సగం మందికిపైగా కోలుకున్నారన్నమాట. 4,232 మంది మృతి చెందారు. వైరస్ బారినపడిన పడిన వారిలో సగానికి పైగా కోలుకోవడంతో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రోజు వారీ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. కాగా, వాణిజ్య సంస్థల యజమానులు, వ్యాపారులు తమ సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుందని జహాన్పూర్ పేర్కొన్నారు.