భారత్ చేజారిన ఇరాన్ గ్యాస్ క్షేత్రం
ABN , First Publish Date - 2021-05-18T06:11:53+05:30 IST
ఇరాన్లోని ఫర్జాద్-బీ గ్యాస్ క్షేత్రం భారత్ చేజారింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ 2008లో ఈ క్షేత్రంలో భారీ సహజ వాయువు (గ్యాస్) నిక్షేపాలు కనుగొంది
న్యూఢిల్లీ: ఇరాన్లోని ఫర్జాద్-బీ గ్యాస్ క్షేత్రం భారత్ చేజారింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ 2008లో ఈ క్షేత్రంలో భారీ సహజ వాయువు (గ్యాస్) నిక్షేపాలు కనుగొంది. దీంతో 1,100 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఆయిల్ కంపెనీలు ప్రతిపాదించాయి. అయితే ఇరాన్పై అమెరికా ఆర్థిక ఆంక్షల ఫలితంగా ఈ చర్చలు పెద్దగా ముందుకు సాగలేదు. దీంతో ఈ క్షేత్ర అభివృద్ధి పనులను తన దేశానికే చెందిన పెట్రోపార్స్ గ్రూప్ అనే కంపెనీకి కట్టబెడుతున్నట్టు ఇరాన్ ప్రకటించింది. సోమవారం ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి. దీంతో ఫర్జాద్-బీ గ్యాస్ క్షేత్రం భారత్ చేజారినట్టయింది. ఇరాన్ తీరంలోని సముద్ర జలాల్లో ఉన్న ఈ క్షేత్రంలో దాదాపు 23 లక్షల కోట్ల ఘనపు అడుగుల గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు ఓఎన్జీసీ విదేశ్ అంచనా. అమెరికా ఆంక్షలను పక్కన పెట్టి పెట్టుబడులు పెట్టేలా భారత్పై ఒత్తిడి పెంచేందుకే ఇరాన్ ఇలా చేస్తోందనే వార్తలూ వినిపిస్తున్నాయి.