Prophet Muhammadపై వ్యాఖ్యల వివాదం : భారత్ వైఖరి సంతృప్తికరం : ఇరాన్

ABN , First Publish Date - 2022-06-09T22:28:40+05:30 IST

ప్రవక్త మహమ్మద్‌పై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై

Prophet Muhammadపై వ్యాఖ్యల వివాదం : భారత్ వైఖరి సంతృప్తికరం : ఇరాన్

న్యూఢిల్లీ : ప్రవక్త మహమ్మద్‌పై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై భారత దేశం స్పందించిన తీరు పట్ల ఇరాన్ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్డోల్లహియన్ భారత ప్రభుత్వ వైఖరి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. 


హొస్సేన్ అమీర్ అబ్డోల్లహియన్‌ (Hossein Amir Abdollahian)ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ గురువారం తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ (Nupur Sharma), నవీన్ జిందాల్ (Navin Jindal) చేసిన వ్యాఖ్యలను హొస్సేన్ బుధవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వద్ద ప్రస్తావించారు. దీనికి దోవల్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందారు. ఈ విషయాన్ని ఇరానియన్ ఫారిన్ మినిస్ట్రీ కూడా ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. హొస్సేన్ ఈ అంశాన్ని దోవల్ వద్ద లేవనెత్తారని, దోవల్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా ఉందని తెలిపింది. ప్రవక్త మహమ్మద్ (Prophet Mohammad) పట్ల భారత ప్రభుత్వానికి, భారత ప్రభుత్వ అధికారులు, నేతలకు గౌరవం ఉందని దోవల్ చెప్పినట్లు తెలిపింది. నేరస్థులపట్ల ప్రభుత్వం, సంబంధిత వ్యవస్థలు అసాధారణ స్థాయిలో, ఇతరులకు గుణపాఠం లభించే విధంగా చర్యలు తీసుకుంటాయని చెప్పినట్లు వివరించింది. నేరస్థులతో వ్యవహరించడంలో భారతీయ అధికారుల వైఖరి పట్ల ముస్లింలు సంతృప్తి చెందారని అమిర్ అబ్డొల్లాహియాన్ చెప్పినట్లు వివరించింది.  


దివ్య మతాల పట్ల, ముఖ్యంగా ప్రవక్త మహమ్మద్ పట్ల భారతీయులు, భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న గౌరవాన్ని అమిర్ ప్రశంసించారు. దేశంలో వివిధ మతాలను పాటించేవారి మధ్య మతపరమైన సహనం, చారిత్రక సహజీవనం, స్నేహభావాలను ప్రశంసించారు. మతపరమైన పవిత్ర భావాల పట్ల ముస్లింలకుగల సున్నితత్వాన్ని శ్రద్ధగా దృష్టి సారించాలని కోరారు. 


బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దేశ, విదేశాల్లో ముస్లింలకు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. 


ఇదిలావుండగా, ఇరాన్ (Iran), భారత్ (India) మధ్య పరస్పర ప్రయోజనకరమైన వివిధ అంశాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరిపారని ఇరానియన్ ఫారిన్ మినిస్ట్రీ ప్రకటనలో తెలిపారు. వ్యూహాత్మక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలపై చర్చించినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉందని అమీర్ చెప్పినట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2022-06-09T22:28:40+05:30 IST