Ips Ravindranath రాజీనామా కలకలం
ABN , First Publish Date - 2022-05-12T17:25:18+05:30 IST
రాష్ట్ర పోలీస్ శిక్షణ విభాగ డీజీపీ డాక్టర్ పీ రవీంద్రనాథ్ రాజీనామాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతలు సూచించారు. డీసీఆర్ఈ
- ఆమోదించవద్దని ప్రభుత్వానికి ప్రతిపక్షాల సూచన
బెంగళూరు: రాష్ట్ర పోలీస్ శిక్షణ విభాగ డీజీపీ డాక్టర్ పీ రవీంద్రనాథ్ రాజీనామాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతలు సూచించారు. డీసీఆర్ఈ డీజీపీగా ఉన్న రవీంద్రనాథ్ను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి పీ రవికుమార్కు లేఖను సచివాలయంలో స్వయంగా సమర్పించడంతో కలకలం చెలరేగింది. నకిలీ కులధ్రువీకరణ పత్రాల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడ్డ కారణంగానే తనను వేధించేందుకు ప్రాధాన్యత లేని శాఖకు బదిలీచేశారని రవీంద్రనాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాజీనామా కొత్తదేమీ కాదు. పదోన్నతి లభించలేదన్న కారణంగా మనస్తాపానికి గురై 2008లో ఒకసారి 2014లో మరోసారి, 2020లోనూతన పదవికి రాజీనామా చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేసే నిజాయితీ పరులైన అధికారులను వేధించడం సరికాదని జేడీఎస్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు. అత్యంత నిజాయితీగా పనిచేస్తున్న ఈ దళిత అధికారి ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన సౌకర్యాలను నకిలీ సర్టిఫికెట్లతో ఇతరులు తన్నుకుపోతుండంపై నిఘా విధించి చర్యలు తీసుకున్నారని, ఇందుకు అభినందించాల్సిన ప్రభుత్వం బదిలీవేటుతో శిక్ష వేయడం అత్యంత విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి పలు ఘటనలతో అక్రమాలకు నెలవుగా మారిన పోలీస్ శాఖ ప్రతిష్ట రవీంద్రనాథ్ రాజీనామాతో మరింత మసకబారిందన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కుట్ర జరిగిందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బెంగళూరులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర హోంశాఖ పూర్తిగా దారితప్పిందన్నారు. ఇటీవలి పరిణామాలన్నీ ఈ శాఖ మర్యాదను మంటగలిపేలా ఉన్నాయన్నారు.