ఐపీఎల్.. విదేశాలకు తరలింపు?
ABN , First Publish Date - 2020-06-05T09:15:16+05:30 IST
కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్-2020పై అనిశ్చితి కొనసాగుతోంది. అయితే, ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్కప్ వాయిదా పడితే
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్-2020పై అనిశ్చితి కొనసాగుతోంది. అయితే, ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్కప్ వాయిదా పడితే ఆ విండోలో ఐపీఎల్ను నిర్వహిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. కానీ, ప్రస్తుతానికి ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అంతటా స్తబ్దత నెలకొంది. కానీ, ఈ ఏడాది ఐపీఎల్ను విదేశాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. దేశంలో కరోనా అదుపులోకి రాకపోతే భారత్కు ఆవల మెగా లీగ్ను నిర్వహించే అవకాశాలనూ పరిశీలిస్తున్నామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘దేశంలో ఆడడం మన ఆటగాళ్లకు భద్రమేనా? అలాగైతే స్వదేశంలో నిర్వహించడానికే తొలి ప్రాధాన్యత. ప్లేయర్ల భద్రతపై అనుమానాలుంటే మాత్రం విదేశాల్లో లీగ్ను నిర్వహించే విషయం గురించి ఆలోచిస్తామ’ని అరుణ్ చెప్పారు. ‘గతంలో దక్షిణాఫ్రికాలో నిర్వహించాం. లీగ్ను విదేశాలకు తరలించడానికి ఇష్టపడం. కానీ, పరిస్థితులు అనుకూలించకపోతే చేసేదేం లేదు’ అని అన్నారు. కరోనా అదుపులో ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ను తమ దేశంలో నిర్వహించాలని శ్రీలంక కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే, అది అంత సులభం కాదని అరుణ్ చెప్పారు. జాతీయ క్యాంప్ను పునః ప్రారంభించే విషయమై సమాలోచన చేస్తున్నట్టు తెలిపారు. ‘లాక్డౌన్ను ఎత్తేసే విషయంలో రాష్ట్రాలు ఒక్కో పద్ధతిని అనుసరిస్తున్నాయి. అందరూ ఒక చోటకి చేరేందుకు సురక్షితమని భావించే వరకు.. ఆటగాళ్లు ఆయా రాష్ట్ర సంఘాలతో సమన్వయం చేసుకుని సాధన చేయాలి’ అని సూచించారు.