కొత్త స్పాన్సర్ నాలుగున్నర నెలలే..
ABN , First Publish Date - 2020-08-11T09:22:53+05:30 IST
వివో స్థానంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 14 వరకు దరఖాస్తు...
న్యూఢిల్లీ: వివో స్థానంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, 18న ఫలితం ప్రకటిస్తామని పేర్కొంది. అయితే టెండర్ ఎవరు దక్కించుకున్నా ఈ ఒప్పందం కేవలం నాలుగున్నర నెలల పాటే ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా అధిక ధరను కోట్ చేసిన వారే విజేతగా నిలుస్తారనే గ్యారెంటీ లేదని పేర్కొంది. మొత్తం 13 పాయింట్లతో కూడిన నిబంధనలను ఈసందర్భంగా బోర్డు కార్యదర్శి జైషా వెల్లడించాడు. ‘బిడ్ నెగ్గిన వారికి ఆగస్టు 18, 2020 నుంచి డిసెంబరు 31, 2020 వరకు మాత్రమే హక్కులు ఉంటాయి. అలాగే అధిక ధరను పేర్కొన్నప్పటికీ ఆ కంపెనీ ఐపీఎల్ బ్రాండ్పై ఏమేరకు ప్రభావం చూపించగలదనే విష యం కూడా పరిగణనలోకి తీసుకుంటాం. ఆతర్వాతే ఒప్పంద హక్కులపై నిర్ణయం తీసుకుంటాం. మార్కెంటింగ్ ఏజెన్సీలు బిడ్ వేసేందుకు అనర్హులు’ అని బోర్డు ప్రకటించింది.
రేసులో పతంజలి!
ఐపీఎల్ టైటిల్ స్పాన్పర్షిప్ కోసం ప్రఖ్యాత ఆయుర్వేద ఉత్పత్తుల కంపెనీ పతంజలి గ్రూప్ పోటీపడనుంది. పతంజలికి బాబా రామ్దేవ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుంటారు. చైనాకు చెందిన వివో మొబైల్ కంపెనీ ఈ ఏడాది లీగ్ నుంచి వైదొలిగాక ఇతర కంపెనీల కోసం బీసీసీఐ వేచిచూస్తోంది. ‘2020 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం పోటీపడాలని ఆలోచిస్తున్నాం. ఓ భారతీయ కంపెనీని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇంతకుమించిన వేదిక లభించదు. అయితే ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు’ అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే తిజారవాలా తెలిపాడు. మరోవైపు రేసులో అమెజాన్, బైజూస్, డ్రీమ్ 11 తదితర కంపెనీలు కూడా ఉన్నాయి.