IPL Final: ఐపీఎల్ 2022 ఫైనల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా..? ట్విట్టర్లో ఓ రేంజ్లో నడుస్తుందిగా..
ABN , First Publish Date - 2022-05-30T22:42:20+05:30 IST
ఐపీఎల్ ఫైనల్ జరిగింది. రాజస్తాన్ రాయల్స్ ఓడింది. గుజరాత్ టైటాన్స్ జట్టు విజేతగా నిలిచి ట్రోఫీ సొంతం చేసుకుంది. కానీ.. చాలామంది క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఫైనల్ ఇంత చప్పగా..
ఐపీఎల్ ఫైనల్ జరిగింది. రాజస్తాన్ రాయల్స్ ఓడింది. గుజరాత్ టైటాన్స్ జట్టు విజేతగా నిలిచి ట్రోఫీ సొంతం చేసుకుంది. కానీ.. చాలామంది క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఫైనల్ ఇంత చప్పగా సాగుతుందని కలలో కూడా అనుకోలేదు. రాజస్తాన్ అంత పేలవ ఆటతీరుతో 130 పరుగులకే చతికిలపడి పోతుందని RR జట్టు అభిమానులే కాదు క్రికెట్ ఫ్యాన్స్ కూడా భావించి ఉండరు. బట్లర్ ఒక్కడూ బ్యాటింగ్లో రాణిస్తేనే రాజస్తాన్ జట్టు మంచి స్కోర్ చేస్తుందని ఉన్న ప్రచారానికి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బలం చేకూర్చింది. గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. IPL Final మ్యాచ్ జరిగిన తీరు మాత్రం క్రికెట్ అభిమానులను నివ్వెరపోయేలా చేసింది.
RR జట్టు ఫైనల్ మ్యాచ్లో అంత తక్కువ స్కోర్ చేస్తుందని ఆ జట్టు అభిమానులు అస్సలు అనుకోలేదు. అందుకే.. RR అభిమానులతో పాటు ఐపీఎల్ ఫైనల్ చూసిన పలువురు నెటిజన్లు ఫైనల్ మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ట్విట్టర్లో వెల్లువెత్తుతున్నాయి. Fixing అనే హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండటం గమనార్హం. మ్యాచ్ గుజరాత్లో జరిగిందని, బీసీసీఐ సెక్రటరీ జయ్షా, హోం మంత్రి అమిత్ షా గుజరాత్ టైటాన్స్కు మేలు జరిగేలా చేసి ఫైనల్లో గుజరాత్ జట్టు గెలిచేలా చేశారని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గెలవగానే స్టేడియంలో ఉన్న జయ్షా విజయోత్సహంతో ఊగిపోయారని, బీసీసీఐ సెక్రటరీగా ఉన్న ఆయన ఒక జట్టు విజయాన్ని సంబరంగా భావించి సెలబ్రేట్ చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్ని జట్లనూ సమానంగా చూడాల్సిన బీసీసీఐ ఇలా ఒక జట్టు విజయాన్ని చేస్తే ఇంక ప్రొఫెషనలిజం ఎక్కడుందని నిలదీస్తున్నారు. మరో నెటిజన్ మాత్రం గుజరాత్ గెలుపుకు కారణం ఇదేనంటూ Fixing హ్యాష్ట్యాగ్ను జత చేసి ఒక పోస్ట్ పెట్టాడు. ‘ఫైనల్ మ్యాచ్కు వేదిక గుజరాత్, ఆడుతున్న టీం గుజరాత్, కెప్టెన్ గుజరాతీ, స్టేడియంలో అమిత్ షా, ఇక గుజరాత్ టైటాన్స్ కాక ఇంకెవరు గెలుస్తారు ? హోం గ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్ కప్పు గెలుచుకునేందుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని 9 ఏళ్ల పిల్లాడిని అడిగినా చెబుతారు’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఏదేమైనా ఈ ఐపీఎల్ ఫైనల్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.