ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్లు జంప్...
ABN , First Publish Date - 2021-12-09T00:34:19+05:30 IST
స్టాక్ మార్కెట్ బుధవారం, డిసెంబరు 8) భారీ లాభాల్లో ట్రేడయ్యింది. వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందన్న అంచనాలతో మార్కెట్ పరుగు పెట్టింది.
ముంబై : స్టాక్ మార్కెట్ బుధవారం, డిసెంబరు 8) భారీ లాభాల్లో ట్రేడయ్యింది. వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందన్న అంచనాలతో మార్కెట్ పరుగు పెట్టింది. అంచనాలకణుగుణంగా వడ్డీ రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించిన నేపధ్యంలో సూచీలు అదే పరుగును కొనసాగించాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 900 పాయింట్ల మేర లాభపడింది. నిఫ్టీ 250 పాయింట్లకు పైగా ఎగిసింది. ఆర్బీఐ పరపతి నిర్ణయాలకు తోడు డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుందన్న వార్తలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి.
ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సెన్సెక్స్ 58,158.56 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,539.72 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,122.27 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,315.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,436.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,308.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు ఏ సమయంలోను నిన్నటి ముగింపు స్థాయికి రాలేదు. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 30 సూచీల్లో కేవలం టైటాన్ మాత్రమే నష్టాల్లో ఉండగా, మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా లాభాల్లోనే ఉన్నాయి.
బుధవారం మధ్యాహ్నానికి ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఆర్బీఐ వడ్డీ రేటు స్థిరంగా కొనసాగుతుందన్న అంచనాల నేపధ్యంలో మార్కెట్ ఉదయం నుండి లాభాల్లోనే ఉంది. ఈ క్రమంలో... ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. నిన్నటి(మంగళవారం)వరకు కూడా వరుసగా రెండు రోజులపాటు మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నిన్న కూడా రూ. 3.33 లక్షల కోట్లు పెరిగింది.
టాప్ గెయినర్స్, లూజర్స్...
ఈ రోజు(బుధవారం) టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, గ్రాసీమ్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో హెచ్డీఎఫ్సీ లైఫ్, దివిస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, కొటక్ మహీంద్రా ఉన్నాయి. ఇక... మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా స్టీల్ ఉన్నాయి.