మూడోరోజూ కాలువ పనుల అడ్డగింత

ABN , First Publish Date - 2021-12-05T04:38:59+05:30 IST

మల్లన్నసాగర్‌లోకి నీటిని తరలించే అదనపు టీఎంసీ కాలువ కోసం భూములిచ్చిన తొగుట మండలం ఘనపూర్‌ గ్రామ నిర్వాసితులకు అధికారులు పూర్తి పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు.

మూడోరోజూ కాలువ పనుల అడ్డగింత
వాహనాల ఎదుట బైఠాయించిన భూ నిర్వాసితులు

తొగుట, డిసెంబరు 4 : మల్లన్నసాగర్‌లోకి నీటిని తరలించే అదనపు టీఎంసీ కాలువ కోసం భూములిచ్చిన తొగుట మండలం ఘనపూర్‌ గ్రామ నిర్వాసితులకు అధికారులు పూర్తి పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో మూడురోజులుగా రైతులు కాలువ పనులు జరగకుండా అడ్డుకుని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో అదనపు టీఎంసీ కాలువ కోసం 74 ఎకరాల 36 గుంటల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి, ఎకరాకు రూ.13 లక్షలు చెల్లిస్తామని హామీఇచ్చింది. మొదటి విడతగా భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.8 లక్షలు చెల్లించారు. మిగతా రూ.5 లక్షలను మూడునెలల్లో చెల్లిస్తామని నమ్మించి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తిచేశారు. అధికారులు హామీఇచ్చి ఆరునెలలు గడుస్తున్నా పరిహారం విషయాన్ని దాటవేస్తుండడంతో నిర్వాసితులకు ఆగ్రహావేశాలు తెప్పించాయి. వెంటనే కాలువ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పనులను అడ్డుకుని అక్కడే బైఠాయించారు. మాకు పూర్తి పరిహారం ఇచ్చేవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. శనివారం రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ దుబ్బాక నియోజకవర్గం ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి అక్కడికి చేరుకుని వారికి సంఘీభావం ప్రకటించారు. రైతులకు పూర్తి పరిహారం ఇచ్చేవరకూ తాము కూడా ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. దాంతో నిర్వాసితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న తొగుట సీఐ రవీందర్‌ కాంగ్రెస్‌ నాయకులతో ఫోన్‌చేసి మాట్లాడారు. రైతులకు రావాల్సిన డబ్బును కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఇప్పిస్తామని హామీఇచ్చారు. రైతులు ఆందోళన చేయొద్దని సూచించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Updated Date - 2021-12-05T04:38:59+05:30 IST