International Day of women in Diplomacy: ఐక్యరాజ్యసమితిలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా దౌత్యవేత్తలు ఎవరో తెలుసా..
ABN , First Publish Date - 2022-06-25T02:56:12+05:30 IST
ఐక్యరాజ్యసమితిలో భారత్ గళం వినిపిస్తున్న మహిళా దౌత్యవేత్తలు ఎవరో ఓమారు తెలుసుకుందాం..
ఎన్నారై డెస్క్: ప్రస్తుత ఆధునిక సమాజంలో మహిళలు పురుషులతో పోటీపడుతూ పురోగమిస్తున్నారు. కానీ.. మహిళా సాధికారత గురించి చేయాల్సింది ఎంతో ఉంది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ దౌత్యవ్యవహారాల్లో మహిళల పాత్రను గుర్తిస్తూ జూన్ 24ను ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ ఇన్ డిప్లొమెసీగా(International Day of women in Diplomacy) గుర్తించాలన్న తీర్మానానికి తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా.. ఐక్యరాజ్యసమితిలో భారత్ గళం వినిపిస్తున్న మహిళా దౌత్యవేత్తలు ఎవరో ఓమారు తెలుసుకుందాం..
స్నేహా దూబే:
2012 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారిణి స్నేహ దూబే ప్రస్తుతం యూఎన్లో భారత దౌత్యబృందంలో ఫస్ట్ ఆఫీసర్గా సేవలందిస్తున్నారు. ఢిల్లీలోని జవహర్లాన్ యూనివర్శిటీలో ఆమె అంతర్జాతీయ వ్యవహారాలపై ఎమ్ఫిల్ చేశారు. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశం లేవనెత్తి అసత్యాలు వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించిన అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఘాటు జవాబిచ్చిన స్నేహా దూబేపై భారత్లో ప్రశంసలు వెల్లువెత్తాయి.
రుచిరా కాంబోజ్
సీనియర్ దౌత్యవేత్త అయిన రుచిరా కాంబోజ్ మంగళవారం ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ శాశ్వత ప్రతినిధిగా ఉన్న సీనియర్ దౌత్యాధికారి టీఎస్ తిరుమూర్తి స్థానంలో ఆమె నియమితులయ్యారు. 1987 ఐఎఫ్ఎస్ అధికారి అయిన ఆమె ఇప్పటివరకూ భూటాన్లో భారత రాయబారిగా సేవలందించారు.
విదిషా మైత్రా
విదిషా మైత్రా 2009 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. 2020లో ఐక్యరాజ్యసమితిలోని అధికారిక, బడ్జెటరీ వ్యవహారాల కమిటీలో సభ్యురాలిగా ఎంపికైన ఆమె.. భారత్ ప్రాధాన్యం అంతర్జాతీయంగా మరింత ఇనుమడించేలా చేశారు. శిక్షణ సమయంలో ఆమె.. ‘‘బెస్ట్ ట్రెయినింగ్ ఆఫీసర్’’ గుర్తింపుతో పాటూ బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో ఆమె విదేశీ వ్యవహారాల శాఖలో అండర్ సెక్రెటరీగా పనిచేశారు.