ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ABN , First Publish Date - 2022-05-07T06:24:47+05:30 IST
జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, ఉర్దూ పరీక్ష జరిగింది.
- జిల్లాలో మొదటి రోజు 9,870 హాజరు కావల్సి ఉండగా 600 మంది విద్యార్థుల గైర్హాజరు
- జిల్లాలో మాల్ ప్రాక్టిస్ కేసులు నిల్
- పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి సలాం
- పలుచోట్ల జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉన్నా పట్టించుకోని అధికారులు
కామారెడ్డి టౌన్, మే 6: జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, ఉర్దూ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జిల్లాలో 9,870 మంది హాజరుకావాల్సి ఉండగా 600 మంది గైర్హాజరు అయ్యారు. ఇందులో జనరల్ సబ్జెక్టులకు 8,882 మంది హాజరుకావలసి ఉండగా 8,405 మంది విద్యార్థులు హాజరయ్యారు. 476 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 988 మంది హాజరుకావాల్సి ఉండగా 864 మంది హాజరయ్యారు. జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్నిచోట్ల పరీక్షలు ప్రశాంతంగానే ముగిశాయి. ఉదయం 8:30గంటలలోపే పరీక్ష కేంద్రాలకు అనుమతి ఉంటుందని సూచించడంతో విద్యార్థులు హైరానా పడుతూ పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.
నిబంధనలు తూచ్
జిల్లా కేంద్రంలో పరీక్షా సమయంలో పలు చోట్ల జిరాక్స్ సెంటర్లు యథేచ్ఛగా తెరిచి ఉంచారు. కొత్త బస్టాండ్, విద్యానగర్లతో పాటు పలు సెంటర్లకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉంచిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూసిన దాఖలాలు లేవు. జిల్లా కలెక్టర్ పరీక్షలపై నిర్లక్ష్యంగా వ్యవహరించదని పకడ్బంది చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించిన అధికారులు మాత్రం పెడచెవిన పెట్టడం వల్ల పరీక్షసెంటర ్ల వద్ద ప్రతీ సంవత్సరం లాగే జిరాక్స్ సెంటర్లు తెరిచే ఉంచారు.
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన నోడల్ అధికారి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీసాందీపని పరీక్షా కేంద్రాన్ని ఇంటర్నోడల్ అధికారి సలాం పరీశిలించారు. విద్యార్థులు ఓపికతో పరీక్షలు రాయాలని ఆందోళన చెందవద్దని సూచించారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఓఆర్ఎస్ ప్యాకెట్లను పరిశీలించి వారికి అందిస్తున్న వైద్యసేవలపై సిబ్బందిని ఆరా తీశారు.