రేపటి వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2022-07-07T09:55:54+05:30 IST

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు.

రేపటి వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. దీంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఫీజును చెల్లించవచ్చు. ఈ మేరకు బోర్డు పరీక్షల విభాగం కంట్రోలర్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫీజు చెల్లించే గడువు ఈ నెల 6తో ముగియగా.. దీన్ని మరో రెండు రోజులు పొడిగించారు. గత నెల 28న ఇంటర్‌ ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం వచ్చే నెల 1 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు రీ-వాల్యుయేషన్‌ కోసం 21,120 మంది, రీ-కౌంటింగ్‌కు 4,787 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగిసింది. కాగా, ఇంటర్మీడియట్‌ బోర్డు పరిధిలో పనిచేస్తున్న 8 మంది జూనియర్‌ కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరించారు. ఈ మేరకు బుధవారం  విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2022-07-07T09:55:54+05:30 IST