ఇంటర్ పరీక్షల్లో చాయిస్ పెంపు!
ABN , First Publish Date - 2022-01-20T06:54:59+05:30 IST
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో చాయిస్ ప్రశ్నలు మరిన్ని పెరగనున్నాయి. గత ఏడాది సాధారణంగా ఇచ్చే చాయిస్ ప్రశ్నల కన్నా ఎక్కువ ప్రశ్నలు ఇచ్చిన ప్రభుత్వం.. ...
గత ఏడాది కన్నా ఎక్కువ చాయిస్
అన్ని విభాగాల్లోనూ పెరగనున్న ప్రశ్నలు
సైన్స్ సబ్జెక్టులకు 60 మార్కులకుగాను..
118 మార్కులతో కూడిన ప్రశ్నపత్రం
లాంగ్వేజ్, ఆర్ట్స్ సబ్జెక్ట్స్కూ ఇదే నిష్పత్తిలో
ఇప్పటికే ముద్రణకు వెళ్లిన ప్రశ్నపత్రాలు!
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో చాయిస్ ప్రశ్నలు మరిన్ని పెరగనున్నాయి. గత ఏడాది సాధారణంగా ఇచ్చే చాయిస్ ప్రశ్నల కన్నా ఎక్కువ ప్రశ్నలు ఇచ్చిన ప్రభుత్వం.. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితులు, ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కావడం వంటి అంశాల నేపథ్యంలో.. ఈసారి సులువుగా ఉత్తీర్ణులయ్యేలా సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్ని విభాగాల ప్రశ్నల్లోనూ చాయిస్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు, ప్రశ్నపత్రాలను రూపొందించి ఇప్పటికే ముద్రణకు ఇచ్చినట్టు సమాచారం. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ వార్షిక పరీక్షలను ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఫీజుల చెల్లింపు షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ను కూడా ప్రకటించే అవకాశ ం ఉంది. పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ప్రశ్నపత్రాలను కొంత ముందుగానే రూపొందించి, ముద్రణకు పంపించినట్లు సమాచారం. ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుల ప్రశ్నపత్రంలో సాధారణంగా మొత్తం 60 మార్కులకుగాను, 76 మార్కుల ప్రశ్నలను ఇస్తారు. ఇందులో 2 మార్కుల ప్రశ్నలు 10 ఉంటాయి. వీటిలో చాయిస్ లేకుండా అన్నింటినీ రాయాల్సి ఉంటుంది. ఇక 4 మార్కుల ప్రశ్నలను 8 ఇస్తారు. వీటిలో 6 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఆ తరువాత 8 మార్కుల విభాగంలో 3 ప్రశ్నలు ఇస్తారు.
వీటిలో రెండింటికి సమాధానం రాయాల్సి ఉంటుంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో తరగతులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో 4 మార్కుల విభాగంలో 8 ప్రశ్నలకు బదులు 12 ప్రశ్నలు ఇచ్చి.. వాటిలో ఆరింటికి సమాధానం రాసే అవకాశం కల్పించారు. అలాగే 8 మార్కుల ప్రశ్నలు మూడింటికి బదులు నాలుగు ఇచ్చి.. రెండు ప్రశ్నలకు సమాధానం రాయాల్సిందిగా సూచించారు. మొత్తంగా 60 మార్కులకుగాను 100 మార్కుల ప్రశ్నలు ఇచ్చారు. ఈ ఏడాది ప్రశ్నల చాయి్సను మరింత పెంచారు. గతంలో చాయిస్ ఆప్షన్ లేని 2 మార్కుల విభాగంలోనూ ఈ అవకాశం కల్పిస్తున్నారు. 10 ప్రశ్నలకు బదులుగా మరో 5 ప్రశ్నలను అదనంగా చేర్చి.. తిరిగి పది ప్రశ్నలకే సమాధానం రాయాలని సూచించనున్నారు. అలాగే 4 మార్కుల విభాగంలోనూ మరో రెండు ప్రశ్నలు పెంచి 14 ప్రశ్నలు ఇవ్వనున్నారు. మొత్తమ్మీద 118 మార్కుల ప్రశ్నల్లో 60 మార్కుల ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు రాయాల్సి ఉటుంది.
ఇదే నిష్పత్తిలో లాంగ్వేజీలు, ఆర్ట్స్ సబ్జెక్టుల ప్రశ్న పత్రాల్లోనూ చాయిస్ ప్రశ్నలను పెంచారు. ఈ నిర్ణయం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన అన్ని సబ్జెక్టులకూ వర్తించనుంది. చాయిస్ ప్రశ్నల సంఖ్యను పెంచడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.