ఇక ఆన్‌లైన్‌లో ఇంటర్‌ ప్రవేశాలు

ABN , First Publish Date - 2020-03-30T11:00:34+05:30 IST

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఇంటర్‌ విద్యామండలి నిర్ణయించింది.

ఇక ఆన్‌లైన్‌లో ఇంటర్‌ ప్రవేశాలు

కార్పొరేట్‌ కళాశాలల అక్రమ అడ్మిషన్లకు కళ్లెం

ఇంటర్‌ బోర్డు నిర్ణయం


కర్నూలు(ఎడ్యుకేషన్‌), మార్చి 29: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఇంటర్‌ విద్యామండలి నిర్ణయించింది. కార్పొరేట్‌ ప్రైవేటు జూనియర్‌ కళాశాలల అక్రమ అడ్మిషన్లకు అడ్డుకట్ట పడనుంది. ఇప్పటికే కార్పొరేట్‌ ప్రైవేటు కళాశాలలో నేరుగా ప్రవేశాలు తీసుకోవద్దని ఇంటర్‌ బోర్డు రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ ఈ నెల 28న ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, రెసిడెన్షియల్‌, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు మొత్తం 265 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 80 వేల మందికి పైగా చదువుకుంటున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 45 వేల మంది దాకా ఉన్నారు.


జిల్లాలో 60 శాతం మంది విద్యార్థులు కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్నారు. తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆర్థిక భారమైనప్పటికీ కార్పొరేట్‌ కళాశాలలోనే చేర్పించి చదివిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అవసరాలను, ఆసక్తిని ఆసరగా తీసుకుని కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు వేలకువేలు రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్‌ కళాశాలల యజమాన్యాలు పెట్టే ఒత్తిడిలను భరించలేక కొందరు విద్యార్థులు జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు. కార్పొరేట్‌ ఆగడాలకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరట కలగనుంది. 


Updated Date - 2020-03-30T11:00:34+05:30 IST