జూన్ 15న ఇంటర్ కాలేజీలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-17T17:35:37+05:30 IST
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తరగతులు జూన్ 15వ తేదీన ప్రారంభం కానున్నాయి. జులై ఒకటో తేదీన మొదటి సంవత్సరం తరగతులను మొదలు పెట్టనున్నారు. 2023 మార్చి 15వ తేదీ నుంచి వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు....
జులై 1 నుంచి ఫస్టియర్ తరగతులు
అక్టోబరు 2 నుంచి దసరా సెలవులు
మొత్తం 221 రోజుల పనిదినాలు
ప్రైవేటు కాలేజీలకూ ఇదే అడ్మిషన్ల షెడ్యూలు
22-23 అకడమిక్ క్యాలెండర్ విడుదల
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తరగతులు(Intermediate Second Year Classes) జూన్ 15వ తేదీన ప్రారంభం కానున్నాయి. జులై ఒకటో తేదీన మొదటి సంవత్సరం తరగతులను మొదలు పెట్టనున్నారు. 2023 మార్చి 15వ తేదీ నుంచి వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్(Academic Calendar)ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. సోమవారం నిర్వహించిన బోర్డు 48వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్యాలెండర్ ప్రకారం ఏడాది మొత్తం 221 పనిదినాలు ఉండనున్నాయి. అడ్మిషన్ల కోసం ప్రైవేట్ కాలేజీలు(Private colleges) ఎలాంటి ప్రకటనలను జారీ చేయకూడదని బోర్డు ఆదేశించింది. బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్లను చేపట్టాలని సూచించింది.
స్పాట్ సిబ్బంది పారితోషకం 25% పెంపు
పరీక్ష విధులు, మూల్యాంకన ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది పారితోషకాన్ని 25 శాతం మేర పెంచింది. పేపర్ను బట్టి కొన్నింటికి రూ. 18.93ల నుంచి రూ. 23.66 వరకు, మరికొన్నింటికి రూ. 641 నుంచి రూ. 800లవరకు ఈ పారితోషకాన్ని పెంచింది.. ఈ పెంపుదల పట్ల ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి ప్రభుత్వానికి దన్యవాదాలు తెలిపారు.
ఇంటర్ పరీక్షకు 95% విద్యార్థుల హాజరు
సోమవారం నిర్వహించిన ఇంటర్ ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1 పరీక్ష సుమారు 95 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల కోసం మొత్తం 4,71,865 మంది హాజరు కావాల్సి ఉండగా, ఇందులో 4,48,083 మంది హాజరయ్యారు. మరో 23,782 మంది గైర్హాజరయ్యారు.