ఇంటర్‌ బోర్డు మరో తప్పిదం..! తెలుగు, ఇంగ్లీషు మీడియం ప్రశ్నల్లో తేడాలు

ABN , First Publish Date - 2022-05-13T16:52:24+05:30 IST

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణలో మరో పొరపాటు చోటుచేసుకుంది. గురువారం జరిగిన ద్వితీయ సంవత్సరం పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షలో... తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు ఓ ప్రశ్న వేర్వేరుగా వచ్చింది. ప్రశ్నపత్రంలోని ..

ఇంటర్‌ బోర్డు మరో తప్పిదం..! తెలుగు, ఇంగ్లీషు మీడియం ప్రశ్నల్లో తేడాలు

పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-2లో పొరపాటు

వేర్వేరుగా వాల్యుయేషన్‌ చేస్తాం: బోర్డు వివరణ


హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల(Intermediate‌ Annual Examinations) నిర్వహణలో మరో పొరపాటు చోటుచేసుకుంది. గురువారం జరిగిన ద్వితీయ సంవత్సరం పొలిటికల్‌ సైన్స్‌(Political Science) పరీక్షలో... తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు ఓ ప్రశ్న వేర్వేరుగా వచ్చింది. ప్రశ్నపత్రంలోని సెక్షన్‌-బి, ప్రశ్న నంబరు-8లో... ఇంగ్లీషు మీడియం పేపర్‌లో ‘1947 భారత స్వాతంత్య్ర చట్టంలోని ముఖ్యాంశాలు రాయండి’ అనే ప్రశ్న ఇచ్చారు. అయితే తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో ఈ ప్రశ్న స్థానంలో.... ‘భారత స్వాతంత్య్ర పోరాటంలో హోంరూల్‌ ఉద్యమాన్ని వర్ణించండి’ అని పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు 5 మార్కులు కేటాయించారు. ఇలా తెలుగులో ఒక ప్రశ్నను, ఇంగ్లీషు మీడియంలో మరో ప్రశ్నను ఇవ్వడం ద్వారా విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై అధికారులు స్పందించారు. ఇంగ్లీషు, తెలుగు మీడియం పేపర్లను విడివిడిగా మూల్యాంకనం చేస్తామని, విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని బోర్డు కార్యదర్శి ప్రకటించారు. కాగా... గురువారం ఇంటర్‌ పరీక్షలకు సుమారు 95.1 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,39,171 మంది హాజరవ్వాల్సి ఉండగా, 4,17,295 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మిగతా 21,876 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే గురువారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 మాల్‌ ప్రాక్టీస్‌ కేసులను నమోదుచేశారు. 

Read more