మేధావులు మౌనం వీడాలి
ABN , First Publish Date - 2022-10-03T08:29:37+05:30 IST
‘‘మేధావులు మౌనం వీడాలి.. మనదేశంలో మీ కళ్లముందే ఏం జరుగుతుందో ఆలోంచాలి.
- దేశంలో ఏం జరుగుతోందో ఆలోచించాలి..
- మహాత్ముడినే కించపరిచేలా మాటలా?
- బాధ కలుగుతోంది.. రక్తం మరుగుతోంది
- ఎప్పటికీ నిలిచి ఉండేది గాంధీ సిద్ధాంతమే
- ఆ మార్గంలోనే తెలంగాణను సాధించాం
- శాంతిలేని జీవితం ఆటవికమే: సీఎం కేసీఆర్
- గాంధీ ఆస్పత్రిలో మహాత్ముని విగ్రహావిష్కరణ
హైదరాబాద్/సికింద్రాబాద్/రాంగోపాల్పేట్/అడ్డగుట్ట, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘మేధావులు మౌనం వీడాలి.. మనదేశంలో మీ కళ్లముందే ఏం జరుగుతుందో ఆలోంచాలి. చెడును ఖండించి.. మంచిని ప్రశంసించాలి. అప్పుడే ఈ సమాజం ఆరోగ్యకరంగా మారుతుంది’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ 153వ జయంతిని పురస్కరించుకొని.. సమకాలీన సమాజం, పోకడలు, వైరుధ్యాలపై ఆలోచన చేయాలన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 16 అడుగుల గాంధీ ధ్యానమూర్తి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. శాంతి, సౌభ్రాతృత్వంతో విలసిల్లే భారత దేశంలో మహాత్ముడినే కించపరిచేలా కొందరి మాటలను వింటున్నామని, ఆ సమయంలో హృదయం బాధ పడటంతోపాటు రక్తం మరుగుతోందని అన్నారు.
సమాజాన్ని చీల్చేందుకు కొన్ని శక్తులు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాయని, వారి వెకిలి ప్రయత్నాల వల్ల మహాత్ముని కృషి, ప్రభ ఏనాడూ తగ్గవని పేర్కొన్నారు. మరుగుజ్జులు ఏనాటికీ మహాత్ములు కాలేరని విమర్శించారు. జై జవాన్ జై కిసాన్ పిలుపునిచ్చిన గొప్ప నిస్వార్థపరుడు, చైనా, పాకిస్థాన్ యుద్ధాలను అద్భుతంగా ఎదుర్కొని దేశాన్ని రక్షించిన ధీరుడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తి జయంతి కూడా ఈరోజేనని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో జై జవాన్.. అగ్నిపథ్లో నలిగిపోతోందని, పంటలకు మద్దతు ధరలేక జై కిసాన్ కృశించి, నశించి పోతున్నారని తెలిపారు. ఇటీవల కొందరు మిత్రులు తనను వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నావంటూ అడిగారని, అయితే దేశం, సమాజం బాగుంటేనే, ప్రపంచంలో శాంతి సామరస్యం ఉంటేనే మనందరం సుఖవంతమైన జీవితం కొనసాగించ గలుగుతామని కేసీఆర్ పేర్కొన్నారు. మనకు ఎన్ని ఆస్తులు, అంతస్తులు ఉన్నా, శాంతి లేనినాడు జీవితం ఆటవికమేనని చెప్పారు.
మానవాళికి గొప్ప సందేశం..
హింస పనికిరాని మార్గమని గాంధీ అద్భుతమైన అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. యావత్ భారతావనిని కుల, మత, వర్గ రహితంగా స్వాతంత్య్ర సమరం వైపు నడిపించిన గొప్ప ేసనాని మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆస్తిని, కుటుంబాన్ని త్యాగం చేసి జైలు పాలవుతూ పోరాటం సాగిస్తున్న గాంధీని చూసి జవహర్ లాల్ నెహ్రూ, వల్లభ్భాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో మహనీయులు భాగస్వాములై పోరాటం ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించారన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో పలువురు తనను అవహేళన చేస్తున్న సందర్భంలో కళ్లు మూసుకొని మహాత్మాగాంధీని తలచుకునే వాడినని, గాంధీ మార్గంలోనే పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని అన్నారు.
గాంధీ స్ఫూర్తితోనే
ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో మన గాంధీ దవాఖాన సాహసోపేతంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలను కాపాడిందని కేసీఆర్ అన్నారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులు, నర్సులు, సిబ్బంది కరోనాపై యుద్ధం చేశారని ప్రశంసించారు. గాంధీ స్ఫూర్తితో పనిచేస్తున్న వైద్యశాఖ మంత్రి హరీశ్రావుకు, గాంధీ ఆస్పత్రి సిబ్బంది మొత్తానికీ సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ విద్యార్థులతో పాటు నర్సులకు ఉపకార వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మహాత్ముడు చెప్పిన పారిశుధ్యం కోసం.. గాంధీ ప్రేరణతోనే రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని, దీంతో అనేక అవార్డులు అందుకుంటున్నామని పేర్కొన్నారు.
మహాత్ముడికి కేసీఆర్ నివాళి
సికింద్రాబాద్ ఎంజీ రోడులోని చారిత్రక మహాత్ముడి విగ్రహం వద్ద రూ.1.32 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనులను మంత్రులు తలసాని శ్రీనివా్సయాదవ్, హరీశ్రావుతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1951లో ప్యారడైజ్ థియేటర్ అధినేత తొడపునూరి అంజయ్య ఇటలీలో తయారు చేయించి ఈ పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అంజయ్య వారసులైన జస్టిస్ అమర్నాథ్గౌడ్, ఇతర కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ సత్కరించారు. కాగా, సీఎం కార్యక్రమాల నేపథ్యంలో పోలీసుల బందోబస్తు, గాంధీ ఆస్పత్రికి వెళ్లే రహదారుల్లో ఆంఽక్షలతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.