సీమ అభివృద్ధికి మేధావులు గళం విప్పాలి
ABN , First Publish Date - 2022-05-20T05:35:35+05:30 IST
నిత్యం కరువుతో అల్లాడుతున్న రాయలసీమ అభివృద్ధి కోసం మేధావులు గళం విప్పాలని రాయలసీమ సాగునీటి సాధనసమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి కోరారు.
మదనపల్లె అర్బన్/టౌన్, మే 19: నిత్యం కరువుతో అల్లాడుతున్న రాయలసీమ అభివృద్ధి కోసం మేధావులు గళం విప్పాలని రాయలసీమ సాగునీటి సాధనసమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి కోరారు. గురువారం స్థానిక ఇండియన్ యూనియన్ క్లబ్లో ఈ నెల 31న జరుగునున్న సిద్ధేశ్వర జలదీక్ష విజయవంతం చేయాలని కోరుతూ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవగాహన లోపం వలన గతంలో కేం ద్ర ప్రభుత్వం అనుమతించిన కృష్ణా- పెన్నార్ ప్రాజెక్టును సిద్ధేశ్వరం వద్ద కాకుండా నందికొండ వద్ద నాగార్జున ప్రాజెక్టును నిర్మించి రాయలసీమకు అన్యాయం చేశాయని అన్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి చెందుతున్న నమ్మకంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వేలాదిమంది భూములు ఇచ్చి నష్టపోయారని, ఇప్పుడు వారు సర్వసం కోల్పోయి దీనావస్థలో జీవితం గడుపుతున్నారని తెలిపారు. ఏపీ రాష్ట్రవిభజన చట్టంలో ఏడు ప్రాజెక్టులు అనుమతించడం రాయలసీమకు వరమన్నారు. రాష్ట్రవిభజన చట్టం ద్వారా ఏర్పడిన కృష్ణానది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్లో ఈ ఏడు ప్రాజెక్టులను అనుమతిలేనివిగా పేర్కొనడం రాయలసీమకు తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు. ఏపీ రాష్ట్ర విభజన చట్టం ద్వారా రాయలసీమకు లభించే హక్కుకు కేంద్రం మోకాలడ్డు వేస్తుంటే ప్రశ్నించాల్సిన రాజకీయ పార్టీలు, నాయకులు తమకు సంబంధంలేనట్లుగా ఉన్నారని ఆయన విమర్శించారు. రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమనే భావనే లేని నేపఽథ్యంలో సిద్ధేశ్వర ఉద్యమం 2016లో మొదలైందన్నారు. సిద్ధేశ్వర అలుగు నిర్మించాల్సిన కృష్ణానది ప్రాంతంలో వంతెన నిర్మాణంలో కల్వకుర్తి నంద్యాల మధ్యన నాలుగులైన్లు జాతీయరహదారి కేం ద్రప్రభుత్వం నిర్మాణం చేపడుతుంటే అక్కడ వంతెన తోపాటు అలుగు కూడా నిర్మించాలని అడగలేని రాజకీయ పాలకులు ఉండటం మన దురదృష్టకరమన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం కానీ విశాఖపట్నంలో కేఆర్ఎంబీ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం విడ్డూరంగా ఉందన్నారు. కృష్ణానది నీటిపంపిణీలో కీలకంగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఉన్నందున కృష్ణానది యాజమాన్యంబోర్డును కర్నూలు ఏర్పాటు చేయాలని దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధికోసం చట్టబద్ద నీటిహక్కు కోసం, సిద్థేశ్వర అలుగు నిర్మాణం కోసం గళంవిప్పి ఉద్యమానికి అండగా నిలబడాలని ఆయన కోరారు. సమావేశంలో శ్రీకాంత్రెడ్డి, గౌరీశంకర్రెడ్డి, సునిల్ కుమార్రెడ్డి, ఉత ్తన్న తదితరులు పాల్గొన్నారు.