విశ్వకర్మలను అవమానించడం KTR అహంకార ధోరణికి నిదర్శనం: Vijayashanti
ABN , First Publish Date - 2022-07-05T02:30:15+05:30 IST
Hyderabad: బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో
Hyderabad: బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైందని, విశ్వకర్మ సామాజిక వర్గాన్ని అవమానించడం కేటీఆర్ అహంకార ధోరణికి నిదర్శనమని తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు.
‘‘టీఆర్ఎస్ నేతలకు అధికార గర్వం తలకెక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మోడీని విమర్శించే స్థాయి కేసీఆర్కు లేదు. అయినా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ పప్పులు ఇక ఉడకవు. ఈ పెద్ద దొర కేసీఆర్ను చూసి.. చిన్న దొర కేటీఆర్ బీజేపీ జాతీయనేత తల్లోజు ఆచారిని ఉద్దేశించి విశ్వకర్మలను అవమానపరిచేలా మాట్లాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సేవలు.. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంత్ త్యాగాన్ని మరచి.. ఆ సామాజిక వర్గానికి చెందిన విశ్వకర్మలను అవమానించడం కేటీఆర్ అహంకార ధోరణికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమ మార్గదర్శకుడు ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాడారు. జయశంకర్, శ్రీకాంతాచారిని సైతం అగౌరపరిచేలా వారి సామాజికవర్గం గురించి కేటీఆర్ అలా మాట్లాడటం బాధాకరం.
అందుకే అనుచిత వ్యాఖ్యలు, దాడులు
‘‘బీజేపీ విజయ సంకల్ప సభ విజయవంతమైంది. తెలంగాణలో బీజేపీ బలపడటం చూసి టీఆర్ఎస్ నేతలకు వెన్నులో వణుకు మొదలైంది. త్వరలోనే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు, నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్.. నువ్వు, నీ పార్టీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా... తెలంగాణ ప్రజలు మా వైపే ఉన్నారు. అధికార అహంకారంతో వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ప్రజానీకం కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయం.’’ అని పేర్కొన్నారు.