రైతు ఫిర్యాదుతో ఫర్టిలైజర్‌ దుకాణం తనిఖీ

ABN , First Publish Date - 2022-01-29T05:40:58+05:30 IST

యూరియా బస్తాలో మట్టిపెళ్లలు వచ్చాయన్న రైతు ఫిర్యాదుతో ఎరువుల దుకాణాన్ని వ్యవసాయాధికారులు శుక్రవారం తనిఖీ చేశారు.

రైతు ఫిర్యాదుతో ఫర్టిలైజర్‌ దుకాణం తనిఖీ
దుకాణాన్ని తనిఖీ చేస్తున్న వ్యవసాయాధికారులు

సూర్యాపేట సిటీ, జనవరి 28 : యూరియా బస్తాలో మట్టిపెళ్లలు వచ్చాయన్న రైతు ఫిర్యాదుతో ఎరువుల దుకాణాన్ని వ్యవసాయాధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన రైతు గునుగుండ్ల యల్లయ్య పాత వ్యవసాయ మార్కెట్‌లోని ఎరువుల దుకాణంలో ఈ నెల 27న మూడు యూరియా బస్తాలను కొనుగోలు చేశాడు. శుక్రవారం ఉదయం పొలంలో బస్తాలను తెరిచి చూడగా, వాటిలో నల్లగా చిన్నచిన్న మట్టి పెళ్లలు కనిపించాయి. ఈ విషయాన్ని రైతు తమ దృష్టికి తీసుకువచ్చాడని జిల్లా వ్యవసాయాధికారి డి.రామారావునాయక్‌ తెలిపారు. రైతు ఫిర్యాదు మేరకు సదరు ఎరువుల దుకాణాన్ని సందర్శించి, నిల్వ చేసిన సుమారు 10 టన్నుల యూరియా బస్తాలను పరిశీలించామన్నారు. వాటి నుంచి సేకరించిన శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ల్యాబ్‌కు  పంపించామని; ల్యాబ్‌ నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా ఎరువుల దుకాణ యజమాని, ఆ దుకాణదారుడికి యూరియాను సరఫరా చేసిన డీలర్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వేప నూనె కలిపిన యూరియా కావడం వల్ల కొంచెం యూరియా నల్లగా ఉందని, అవి మట్టి పెళ్లలు కావని ఎరువుల దుకాణం యజమాని తెలిపాడు. తనిఖీల్లో సూర్యాపేట మండల ఏవో జానీమియా, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-29T05:40:58+05:30 IST