సీఎం జగన్ సీరియస్.. ఆ మంత్రిని పక్కా ప్లాన్‌తోనే ఇరికించారా?

ABN , First Publish Date - 2020-09-30T17:36:35+05:30 IST

ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఇంటిపోరు పెరిగిందా? వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన వైసీపీలో ఒంటరయ్యారా? మంత్రి జయరాంకు మంత్రులు, జిల్లా

సీఎం జగన్ సీరియస్.. ఆ మంత్రిని పక్కా ప్లాన్‌తోనే ఇరికించారా?

ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఇంటిపోరు పెరిగిందా? వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన వైసీపీలో ఒంటరయ్యారా? మంత్రి జయరాంకు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు మద్దతు తెలపక పోవడానికి కారణాలు ఏమిటి? సొంత పార్టీ నేతలే ప్రతిపక్ష నాయకులకు లీకులు ఇస్తున్నారా? మంత్రిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారా? మంత్రి జయరాం రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయా?


పక్కా ప్లాన్‌తోనే ఇరికించారని...

ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. మంత్రి సొంతూరు గుమ్మనూరులో పేకాట క్లబ్‌పై పోలీసులు దాడులు చేయడం..మంత్రి బంధువు అరెస్ట్ కావడం..భూ కబ్జాల ఆరోపణలు జయరాంను ఇరుకునపెట్టాయి. తాజాగా ఈఎస్‌ఐ స్కామ్‌లో 14వ నిందితుడిగా ఉన్న కార్తీక్‌ నుంచి మంత్రి కుమారుడు ఈశ్వర్‌ బెంజికారు గిఫ్ట్‌గా తీసుకున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కుమారుడు షోరూమ్‌లో కారు తాళాలు తీసుకోవడం.. ఆ కారులో ప్రయాణించడం వంటి ఫొటోలను టీడీపీ విడుదల చేసింది. కర్నూలు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలకు మంత్రి జయరాం మధ్య ఉన్న విభేదాల వల్ల ఆయన్ని పక్కా ప్లాన్‌తో ఇరికించినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


మంత్రి ఒంటరయ్యారా...?

గుమ్మనూరులో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న విషయాన్ని మంత్రికి గిట్టని ప్రజాప్రతినిధులే పోలీసులకు సమాచారం ఇచ్చారనే చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఈఎస్ఐ స్కామ్ నిందితుడితో మంత్రి జయరాం కుమారుడు సన్నిహితంగా ఉన్న విషయాన్ని సైతం వైరీ వర్గం టీడీపీ లీడర్లకు లీక్‌ చేసిందట. తాజాగా మంత్రి జయరాంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాం ఈఎస్ఐ స్కాంలో నిందితుడి నుంచి బెంజి కారును బహుమతిగా పొందారని తన ఫిర్యాదులో వెల్లడించారు. అయితే తాను అక్రమాలకు పాల్పడలేదని, తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం చెబుతున్నారు. టీడీపీ నాయకులు వరుసపెట్టి ఆరోపణలు చేస్తున్నా మంత్రికి మద్దతుగా మాటమాత్రమైనా మాట్లాడే సొంత పార్టీ నాయకులు కరువైపోయారు. సహచర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవ్వరూ మాట్లాడటం లేదు. అటు జయరాంకు మద్దతుగా కర్నూలు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. దాంతో మంత్రి జయరాం పార్టీలో, ప్రభుత్వంలో ఒంటరయ్యారా అనే చర్చ సాగుతోంది.


సీఎం జగన్‌ను రహస్యంగా కలిశారా...?

మంత్రి జయరామ్‌కు మద్దతుగా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదన్నది కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. మంత్రిపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని నమ్ముతున్నారా? లేక ఈ  ఆరోపణలు జయరాం వ్యక్తిగత విషయంగా భావిస్తున్నారా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. గుమ్మనూరులో పేకాట క్లబ్ ఘటన వెలుగుచూసిన తర్వాత మంత్రి జయరాం సీఎం జగన్‌ను రహస్యంగా కలిశారట. ఈ విషయంపై మంత్రికి సీఎం గట్టిగానే క్లాస్ పీకారట. ఇప్పుడు బెంజి కారు వివాదంలో సీఎం జగన్‌ ఎలా స్పందిస్తారోనని ఒకింత ఆందోళనతో ఉన్నారట మంత్రి జయరాం. అవినీతి,అక్రమాల ఆరోపణలు జయరాంను చుట్టుముడుతుండటంతో..ఆయన మంత్రి పదవి ఉంటుందా లేక ఊడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరుస వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తున్న మంత్రి జయరాంపై సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.

Updated Date - 2020-09-30T17:36:35+05:30 IST