ఆధార్‌ విచారణ మే 20న

ABN , First Publish Date - 2020-02-20T08:50:29+05:30 IST

ఆధార్‌ కార్డుకు, పౌరసత్వానికి సంబంధం లేదని యునీక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) అధికారులు స్పష్టం

ఆధార్‌ విచారణ మే 20న

  • 3 నెలలు వాయిదా వేసిన యూఐడీఏఐ
  • పత్రాల సమర్పణకు గడువు కోరారు
  • పౌరసత్వానికి, ఆధార్‌కు సంబంధం లేదు
  • తప్పుడు పత్రాలిచ్చినందుకే విచారణ
  • యూఐడీఏఐ అధికారుల వివరణ
  • అధికారులకు ఆ అధికారం ఉందా: అసద్‌
  • హిందువుల సంతతి పెరగకుండా.. ఆన్‌లైన్‌ ఫుడ్‌లో కెమికల్స్‌: రాజాసింగ్‌

హైదరాబాద్‌/సిటీ(ఆంధ్రజ్యోతి): ఆధార్‌ కార్డుకు, పౌరసత్వానికి సంబంధం లేదని యునీక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) అధికారులు స్పష్టం చేశారు. తప్పుడు పత్రాలతో ఆధార్‌ కార్డులు తీసుకున్న వారిని విచారించడానికి గురువారం జారీ చేసిన నోటీసులను వాయిదా వేసినట్లు ప్రకటించారు. విచారణను ఫిబ్రవరి 20న కాకుండా మే 20కి వాయిదా వేసినట్లు తెలిపారు. ‘‘అక్రమంగా దేశంలోకి వచ్చిన వారికి ఆధార్‌ కార్డులు జారీ చేయవద్దంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. దాంతో, పోలీసు ఫిర్యాదులు.. వివిధ సందర్భాల్లో మా దృష్టికి వచ్చిన నకిలీ ఆధార్‌ కార్డులను పరిశీలిస్తున్నాం. తప్పుడు పత్రాలతో జారీ అయ్యాయని భావిస్తే వాటిని రద్దు చేసే అవకాశం ఉంది. అందుకే, అలాంటి వారిని 127 మందిని గుర్తించి నోటీసులు జారీ చేశాం. కానీ, పత్రాలు సేకరించడానికి వాళ్లు అదనపు సమయం కోరారు. దాంతో, మరో 3 నెలల సమయం (మే 20) వరకు గడువు ఇస్తున్నాం’’ అని తెలిపారు. పౌరసత్వంతో ఆధార్‌కు సంబంధం లేదని, తప్పుడు పత్రాలు, తప్పుడు బయో మెట్రిక్‌లు ఇచ్చి ఆధార్‌ కార్డులు పొందిన వారిని గుర్తించి వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వారు పొందిన ఆధార్‌ కార్డు నంబర్లను రద్దు చేస్తామని వివరించారు. 


అసదుద్దీన్‌ గరం గరం


‘‘మీ పౌరసత్వాన్ని నిరూపించుకోండి అంటూ యూఐడీఏఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ, పౌరసత్వాన్ని నిర్ధారించేందుకు యూఐడీఏఐ అధికారులకు ఎటువంటి అధికారమూ లేదు. నిబంధనలకు విరుద్ధంగా నోటీసులు జారీ చేసిన యూఐడీఎఐ అధికారులు, తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలి’’ అని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. తప్పుడు పత్రాలతో ఆధార్‌ కార్డు పొందారనే కారణంతో పాత నగరంలో 127 మందికి నోటీసులు జారీ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం వరుస ట్వీట్లు చేశారు. ఈ కేసులో విచారణ అధికారిగా డిప్యూటీ డైరెక్టర్‌ను నియమించారని, అసలు ఆయనకు ఏం అధికారం ఉందని నిలదీశారు. ప్రాథమిక విచారణలో నిర్దిష్టంగా నిర్ధారించాలని, కానీ, అలా గుర్తించినట్లు నోటీసుల్లో పేర్కొనలేదని తప్పుబట్టారు. తప్పుడు పత్రాలు ఏవో కూడా నోటీసుల్లో పేర్కొనలేదని తెలిపారు. ‘‘ఈ సమాచారాన్ని మీకు ఏ పోలీసు అధికారి ఇచ్చారు? 127 మంది పేర్లకు సంబంధించిన జాబితాను యూఐడీఏఐ అధికారులు ఇచ్చారో లేదో తెలంగాణ డీజీపీ స్పష్టం చేయాలి. యూఐడీఏఐ తన బాధ్యతను తెలంగాణ పోలీసులకు అప్పగించిందా?’’ అని ప్రశ్నించారు. పౌరసత్వాన్ని తనిఖీ చేయడానికే నోటీసులు జారీ చేసినట్లు అందులో పేర్కొన్నారని, తద్వారా, తన అధికారాలను అతిక్రమించారని, కనక, దానిని జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్‌ను యూఐడీఏఐ సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నోటీసులు అందుకున్న 127 మందిలో ముస్లింలు, దళితులు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. కార్డన్‌ సెర్చ్‌లో ఆధార్‌ కార్డులు అడగకుండా పోలీసులను ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-02-20T08:50:29+05:30 IST