రూ.10 లక్షల స్వాహాపై విచారణ

ABN , First Publish Date - 2021-10-29T05:19:01+05:30 IST

పేద మహిళల జీవనోపాధి సొమ్మును కాజేసినట్లు వెలుగు కార్యాలయ అకౌంటెంట్‌ ఒప్పుకున్నారు. రూ.10 లక్షలు స్వాహా చేసింది నిజమేనని విచారణలో అంగీకరించారు.

రూ.10 లక్షల స్వాహాపై విచారణ
రికార్డులను పరిశీలిస్తున్న విచారణ అధికారులు

  1. తానే డ్రా చేసినట్లు ఒప్పుకున్న అకౌంటెంట్‌ 


డోన్‌, అక్టోబరు 28: పేద మహిళల జీవనోపాధి సొమ్మును కాజేసినట్లు వెలుగు కార్యాలయ అకౌంటెంట్‌ ఒప్పుకున్నారు. రూ.10 లక్షలు స్వాహా చేసింది నిజమేనని విచారణలో అంగీకరించారు. ‘రూ.10 లక్షలు స్వాహా’ అన్న శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. దీంతో డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు తక్షణమే విచారణ చేపట్టారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు మేనేజర్‌ లక్ష్మయ్య, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్‌ షేక్‌ అబ్దుల్‌ రహిమాన్‌ డోన్‌ వెలుగు కార్యాలయానికి వచ్చారు. ఏరియా కో ఆర్డినేటర్‌తోపాటు అకౌంటెంట్‌ను విచారించారు. ఓబులాపురం, నక్కలవాగుపల్లి, గుండాల గ్రామాలకు సంబంధించిన యూఎన్‌డీపీ రుణాల లావాదేవీల రికార్డులను పరిశీలించారు. తానే డబ్బును స్వాహా చేసినట్లు అకౌంటెంట్‌ ఒప్పుకున్నారు. కంతుల వారీగా డబ్బును చెల్లిస్తానని అంగీకార పత్రం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో విచారణ అధికారులు స్థానిక వెలుగు అధికారులకు పలు హెచ్చరికలు, సూచనలు చేసినట్లు తెలిసింది. పొదుపు గ్రూపులకు ఇచ్చే రుణాలలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. 

Updated Date - 2021-10-29T05:19:01+05:30 IST