ఆందోల్‌మైసమ్మ ఆలయంలో అవకతవకలపై విచారణ?

ABN , First Publish Date - 2021-12-23T05:38:42+05:30 IST

హైదరాబాద్‌-విజయవాడ రహదారి వెంట చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌లో ఉన్న ఆందోల్‌ మైసమ్మ దేవాలయంలో అవకతవకలపై దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు.

ఆందోల్‌మైసమ్మ ఆలయంలో అవకతవకలపై విచారణ?

 ఈవో, సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదులపై ఉన్నతాధికారుల ఆరా 

యాదాద్రి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-విజయవాడ రహదారి వెంట చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌లో ఉన్న ఆందోల్‌ మైసమ్మ దేవాలయంలో అవకతవకలపై దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఆలయ ఈవోతో పాటు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టనున్నట్టు తెలిసింది. మరోవైపు ఆలయ ఈవో వెంకట్‌రెడ్డితో పాటు సిబ్బంది హైదరాబాద్‌లోని కమిషనర్‌ కార్యాలయానికి బుధవారం వెళ్లి ఉన్నతాధికారులను కలిశారు. ఆలయంలో వాహనాల పూజలకు దేవాదాయశాఖ నిర్ణయించిన టికెట్‌ ధర కంటే మూడింతలు అదనంగా వసూలు చేస్తున్న విషయంపై ఈవోను అడిగినట్టు సమాచారం. ఆలయంలో టికెట్‌ ధరకు మించి అదనంగా వసూలు చేస్తున్నారని, దేవాదాయశాఖ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఆలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భక్తులను ఇబ్బందులను గురిచేస్తున్నారని ఆలయ అధికారులతోపాటు సిబ్బందిపై పోలీసులకు వడ్లమూడి భాస్కర్‌రావు అనే భక్తుడు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు ఆలయ సిబ్బందిపై పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఆలయంలో అవినీతి, అక్రమాలపై సమగ్ర వి చారణచేయాలని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ సిద్దిపేట శేఖర్‌రెడ్డి దేవాదాయశాఖ కమిషనర్‌కు మంగళవారం ఫిర్యాదుచేశారు. ఆలయ అభివృ ద్ధి కమిటీ సభ్యులు సైతం ఆరోపణలపై ఆరా తీశారు. ప్రధానంగా ఆదా యం, ఖర్చుల వివరాలను ఆలయ అభివృద్ధి కమిటీకి ఈవో తెలియజేయడంలేదన్న అభియోగం ఉంది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఎంత మేరక ు ఖర్చయింది, భక్తుల విరాళాలు తదితర అంశాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌తో పాటు సభ్యు లు ఉన్నతాధికారులను కోరారు.


త్వరలో పాలకమండలి సమావేశం

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామస్థులతో ఆలయం ప్రాంగణంలో త్వరలో సమావేశాన్ని నిర్వహించేందు కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారులను సైతం ఆహ్వానించనున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ తీర్మానం మేరకే భక్తుల వద్ద అదనంగా డబ్బు వసూలు చేస్తున్నామని ఈవోతో పాటు సిబ్బంది చేసిన ఆరోపణలపై అందరి సమక్షంలో చర్చించనున్నట్టు చైర్మన్‌ శేఖర్‌రెడ్డి తెలిపారు. తాము ఏనాడూ అదనంగా వసూలు చేయాలని తీర్మానం చేయలేదని ఆయన తెలిపారు. ఆలయ ఆదాయం, ఖర్చులు, బోనాల ఉత్సవాల లెక్కలను కమిటీ సభ్యులు పలుమార్లు అడిగినా ఈవోను వెల్లడించడంలేదన్నారు. ఈవోతో పాటు సిబ్బంది తరచూ విధులకు గైర్హాజరవుతున్నారని ఆయన ఆరోపించారు. త్వరలో నిర్వహించే సమావేశంలో వీటన్నింటినీ సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-12-23T05:38:42+05:30 IST