అధిక ఫీజులపై విచారణ జరపాలి: ఎఫ్‌జీజీ

ABN , First Publish Date - 2020-07-11T08:49:30+05:30 IST

ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వైనంపై విజిలెన్స్‌తో ..

అధిక ఫీజులపై విచారణ జరపాలి: ఎఫ్‌జీజీ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వైనంపై విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి గవర్నర్‌కు శుక్రవారం లేఖ రాశారు. 2020-21 విద్యా సంవత్సరంలో పాఠశాల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో నంబరు 46 విడుదల చేసిందని, ఈ జీవో ప్రకారం సంవత్సరంలో నెలవారి ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని ఆయన గుర్తుచేశారు.


అయితే ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఓ వైపు అధిక ఫీజులు వసూలుచేస్తున్నాయని, మరోవైపు పాఠశాలలు నిర్వహించకుండా రవాణా చార్జీలు కూడా పిండుకుంటున్నాయని, ఆన్‌లైన్‌ పాఠాల కోసం కంప్యూటర్‌ ఇతర పరికరాలు తమ వద్దే కొనాలని షరతులు విధిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ఏపీలో విద్యను వ్యాపారంగా మార్చారని ధ్వజమెత్తారు. ప్రైవేటు పాఠశాలల్లో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2020-07-11T08:49:30+05:30 IST