వలసలపై ఆరా
ABN , First Publish Date - 2022-01-25T05:31:01+05:30 IST
జిల్లాలో ఆదోని డివిజన్లోని గ్రామాల నుంచి ఎక్కువగా ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తుండడంపై హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎకనమికల్, సోషల్ స్టడీస్ (సీఈఎ్సఎస్) బృందం పర్యటనకు వచ్చారు.
ఆదోని రూరల్, జనవరి 24: జిల్లాలో ఆదోని డివిజన్లోని గ్రామాల నుంచి ఎక్కువగా ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తుండడంపై హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎకనమికల్, సోషల్ స్టడీస్ (సీఈఎ్సఎస్) బృందం పర్యటనకు వచ్చారు. ఈ సమస్యపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో ఆ బృందం సభ్యులు లక్ష్మణరావు, డా.హరినాథ్, డా.ఆంజనేయులు సోమవారం మండలంలోని కపటి, గణేకల్లు, పాండవగల్లు గ్రామాల్లో ఉపాధి సిబ్బందితో పర్యటించి వలసలకు గల కారణాలను తెలుసుకున్నారు. అంతకుముందు ఎంపీపీ కార్యాలయంలో 17 మండలాల ఏపీవోలతో, ఏపీడీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదోని డివిజన్లో రెండు నెలల పాటు వలసల నివారణపై అధ్యయనం చేస్తామని అన్నారు. శాస్త్రీయంగా పూర్తి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. సమావేశంలో ఈవోపీఆర్డీ జనార్దన్, ఎంఈవో శివరాం, ఏపీవోలు చక్రవర్తి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.