అర్హులకు అన్యాయం జరిగింది!

ABN , First Publish Date - 2020-07-04T10:40:33+05:30 IST

ఇళ్ల స్థలాల జాబితాలో అనర్హుల పేర్లు చేర్చి, అర్హులకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ జడ్పీటీసీ మాజీ సభ్యుడు, వైసీపీ నాయకుడు

అర్హులకు అన్యాయం జరిగింది!

కలువాయిలో వైసీపీ నాయకుల ధర్నా

నిలిచిపోయిన ప్లాట్ల కేటాయింపు


కలువాయి, జూన్‌ 3 : ఇళ్ల స్థలాల జాబితాలో అనర్హుల పేర్లు చేర్చి, అర్హులకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ జడ్పీటీసీ మాజీ సభ్యుడు, వైసీపీ నాయకుడు అనిల్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కలువాయిలో లేఔట్ల వద్ద గ్రామస్థులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కలువాయిలో ఐదు లేఅవుట్లు వేసిన అధికారులు, ఎంపిక చేసిన 366 మంది జాబితాను ప్రకటించారు. లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించేందుకు శుక్రవారం వారందరినీ లేఅవుట్‌ వద్దకు పిలిపించారు.


ఇంతలో వైసీపీ నాయకులు అక్కడకు చేరుకుని జాబితాలో చాలా మంది అనర్హుల పేర్లు చేర్చడంతోపాటు, అర్హులైన వారి పేర్లను తొలగించారంటూ అధికారులను ప్రశ్నించారు. అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 12 వేల మంది జనాభా కలిగిన కలువాయిలో అధికారులు కేవలం 366 మందిని మాత్రమే ఎంపిక చేశారని, ఇందులో కూడా అనర్హులు ఉన్నారని ఆరోపించారు. గ్రామసభలు నిర్వహించినపుడు 850 మందిని అర్హులుగా గుర్తించగా, తుది జాబితాకు 366 మందిని మాత్రమే ఎంపిక చేశారని, దీంతో అర్హులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. దీంతో పాట్ల కేటాయింపును నిలిపివేసిన ఇన్‌చార్జి తహసీల్దారు శ్యాంసుందర్‌ రాజు  వీఆర్వోలతో మళ్లీ విచారణ చేయించి, కొత్త జాబితా తయారు చేయిస్తామని ప్రకటించారు. 

Updated Date - 2020-07-04T10:40:33+05:30 IST