తహసీల్దార్ సజీవ దహనం ఘటనలో గాయపడిన రైతు మృతి
ABN , First Publish Date - 2022-08-10T10:05:44+05:30 IST
తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి ఓ వ్యక్తి ఆమెను సజీవ దహనం చేసిన ఘటన గుర్తుందా
34 నెలల తర్వాత అనారోగ్యంతో కన్నుమూత
అబ్దుల్లాపూర్మెట్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి ఓ వ్యక్తి ఆమెను సజీవ దహనం చేసిన ఘటన గుర్తుందా? అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలో 34 నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో గాయపడిన బొడిగె నారాయణ గౌడ్ అనే రైతు అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. గౌరెల్లి గ్రామానికి చెందిన కొర్ర సురేశ్ 2019 నవంబర్ 4న ఈ దాడి చేయగా.. విజయారెడ్డితోపాటు అటెండర్ చంద్రయ్య, డ్రైవర్ గురునాథం అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రి పాలైన సురేశ్ మూడు రోజుల తర్వాత చనిపోయాడు. సురేశ్ తహసీల్దార్పై దాడి చేసిన సమయంలో అక్కడే ఉన్న కవాడిపల్లికి చెందిన నారాయణ్గౌడ్ కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. చికిత్స అనంతరం నెల రోజులకు డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులు బాగానే ఉన్న నారాయణగౌడ్.. అనారోగ్యంతో 15 రోజుల క్రితం తిరిగి ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకురాగా మంగళవారం ఉదయం మృతి చెందారు. కాగా, నారాయణ్గౌడ్ను ఆదుకుంటామని అధికారులు, నేతలు చెప్పారని, కానీ సీఎం సహాయ నిధి నుంచి అప్పట్లో రూ.2లక్షలు మాత్రమే అందాయని వారు తెలిపారు. ఆపై తమను ఎవ్వరూ పట్టించుకోలేదని, నారాయణగౌడ్ చికిత్స కోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశామని ఆయన కుటుంబసభ్యులు వాపోయారు.