మారుమూల పల్లెలకు మౌలిక సదుపాయాలు
ABN , First Publish Date - 2021-12-03T06:14:02+05:30 IST
ఏజెన్సీలో మారుమూల పల్లెలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.
అధికారులకు ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఆదేశం
పాడేరు, డిసెంబరు 2: ఏజెన్సీలో మారుమూల పల్లెలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ఎంపీడీవోలతో ‘మిషన్ కనెక్ట్ పాడేరు’పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. రానున్న మూడేళ్లలో ప్రతీ గిరిజన పల్లెకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యా మౌలిక సదుపాయాల నిధులు, నాబార్డు, ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు, ఎస్సీఏ, ఆర్టికల్ 275 నిధులు వినియోగించి మిషన్ కనెక్ట్ పాడేరు కింద ఐదారు గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మించాలన్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా 212 సచివాలయ భవనాల్లో 80 భవనాలు పూర్తి కానున్నాయన్నారు. కాంట్రాక్టర్లకు త్వరలోనే బిల్లులు చెల్లింపులు జరుగుతాయన్నారు. ఏజెన్సీకి 138 చెత్త నుంచి సంపద కేంద్రాలు మంజూరయ్యాయని, వాటిలో 22 కేంద్రాలు నిర్మాణాలు పూర్తి చేశారని, మిగిలిన 116 కేంద్రాలు నిర్మాణపు పనులు ప్రారంభించాలని ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ వ్యాప్తంగా 244 పంచాయతీలకుగాను చెత్త సేకరణకు 677 మంది క్లాప్ మిత్రాలు అవసరమని, 72 మందిని మాత్రమే నియమించారని డీఎల్పీవో పీఎస్.కుమార్ పీవో దృష్టికి తీసుకువచ్చారు. పారిశుఽధ్య కార్మికుల కొరత వలన నియామకం జరగలేదన్నారు. 605 మంది క్లాప్ మిత్రాలు అవసరమని, వారికి నెలకు రూ.6 వేతనం చెల్లిస్తామన్నారు. పూర్తి స్థాయిలో క్లాప్ మిత్రాలను నియమించి పొడి, తడి చెత్త సేకరించాలని పీవో పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డ్వామా పీడీ సందీప్, పంచాయతీరాజ్ ఎస్ఈ రవీంద్ర, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ డీవీఆర్ఎం.రాజు, పంచాయతీరాజ్ ఈఈలు కొండయ్య, శ్రీనివాసరావు, ఉపాధి హామీ ఏపీడీ గిరిబాబు, డీఈఈలు, ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీవోలు పాల్గొన్నారు.