మౌలిక సదుపాయాలు, నియామకాలే కీలకం
ABN , First Publish Date - 2022-08-20T09:01:34+05:30 IST
విస్తృతమైన మౌలిక సదుపాయాలు, పూర్తిస్థాయి నియామకాలు జరిగినప్పుడే న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువ అవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
అప్పుడే ప్రజలకు చేరువగా న్యాయవ్యవస్థ
సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్య
న్యాయమూర్తుల అతిథిగృహం,
కల్చరల్ సెంటర్లకు శంకుస్థాపన
అప్పుడే ప్రజలకు చేరువగా న్యాయవ్యవస్థ.. సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్య
న్యాయమూర్తుల అతిథిగృహం, కల్చరల్ సెంటర్లకు శంకుస్థాపన
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విస్తృతమైన మౌలిక సదుపాయాలు, పూర్తిస్థాయి నియామకాలు జరిగినప్పుడే న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువ అవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో నిర్మించతలపెట్టిన హైకోర్టు న్యాయమూర్తుల అతిథిగృహం, కల్చరల్ సెంటర్లకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నవీన్రావుతో కలిసి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని రాష్ర్టాల్లో హైకోర్టులకు అతిథిగృహాలు ఉన్నప్పటికీ కల్చరల్ సెంటర్ ఏర్పాటు ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. వృత్తిపరమైన ఒత్తిడిలో ఉండే న్యాయమూర్తులకు ఆహ్లాదం, వ్యాయామం కోసం కల్చరల్ సెంటర్ అవసరమని తెలిపారు. అతిథిగృహం నిర్మాణానికి నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. 18 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తాను పదవీ విరమణ చేసిన తరువాత ఎక్కడ ఉన్నా ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని సరదాగా వ్యాఖ్యానించారు.
న్యాయ నిర్మాణ్ డాక్యుమెంట్ విడుదల..
హైకోర్టు సీనియన్ న్యాయమూర్తి జస్టిస్ నవీన్రావు నేృతృత్వంలోని భవన నిర్మాణ కమిటీ రూపొందించిన ప్రామాణిక కోర్టు భవన నిర్మాణ ప్రణాళిక (న్యాయ నిర్మాణ్ డాక్యుమెంట్)ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే ఉజ్జల్ భుయాన్ విడుదల చేశారు. దేశంలో ఎక్కడైనా పోలీ్సస్టేషన్ భవనాలు, జిల్లా కలెక్టరేట్ భవనాలు ప్రజలు సులభంగా గుర్తించే విధంగా ఉంటాయని, అయితే కోర్టు భవనాలు ఎలా ఉంటాయో ప్రజలకు తెలియదని జస్టిస్ రమణ అన్నారు. మౌలిక సదుపాయాలు సరిగాలేని కారణంగా అద్దెభవనాల్లో కోర్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. జస్టిస్ నవీన్రావు నేతృత్వంలో రూపొందించిన కోర్టు భవనాల ప్రామాణిక ప్రణాళికను ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తే బాగుంటుదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి డాక్యుమెంట్ను రూపొందించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల బలోపేతానికి ఇది అద్భుతమైన ప్రణాళిక అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ఏజీ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నర్సింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్రెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.రఘునాథ్, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, కమిషనర్ సీవీ ఆనంద్, రిజిస్ర్టార్ జనరల్ సుజన పాల్గొన్నారు.