జీడీపీ వృద్ధి రేటు స్వాతంత్ర్యానంతరం అత్యంత కనిష్టానికి : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి హెచ్చరిక

ABN , First Publish Date - 2020-08-12T00:07:24+05:30 IST

కోవిడ్-19 మహమ్మారితో కలిసి బతకడానికి ప్రజలు సిద్ధమైపోవాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు

జీడీపీ వృద్ధి రేటు స్వాతంత్ర్యానంతరం అత్యంత కనిష్టానికి : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి హెచ్చరిక

బెంగళూరు : కోవిడ్-19 మహమ్మారితో కలిసి బతకడానికి ప్రజలు సిద్ధమైపోవాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి చెప్పారు. మన దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి స్వాతంత్ర్యానంతరం అత్యంత కనిష్టానికి పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మహమ్మారి సృష్టించిన విధ్వంసం నుంచి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలన్నారు. ‘లీడింగ్ ఇండియాస్ డిజిటల్ రివల్యూషన్’ వర్చువల్ సమావేశంలో నారాయణ మూర్తి మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. 


తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటూ, పరిపూర్ణ శక్తితో పని చేయడానికి దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని రంగాలవారికీ అవకాశం కలిగే విధంగా నూతన వ్యవస్థను అభివృద్ధిపరచాలని పిలుపునిచ్చారు. 


మన దేశ జీడీపీ కనీసం 5 శాతం తగ్గుతుందని అంచనా అని చెప్పారు. మరో భయం కూడా ఉందని, అదేమిటంటే,  స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నమోదవుతున్న జీడీపీ వృద్ధి రేట్లలో ఈ ఏడాది అతి తక్కువ వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం కనిపిస్తోందని తెలిపారు. 


ప్రపంచ జీడీపీ కూడా తగ్గిపోయిందన్నారు. ప్రపంచ వాణిజ్యం తగ్గిపోయిందని, అంతర్జాతీయ ప్రయాణాలు కనుమరుగైపోయాయని చెప్పారు. ప్రపంచ జీడీపీ సుమారు 5 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గుతుందన్నారు. 


‘లీడింగ్ ఇండియాస్ డిజిటల్ రివల్యూషన్’ వర్చువల్ సమావేశాన్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నిర్వహించింది. 

Updated Date - 2020-08-12T00:07:24+05:30 IST