రేట్ల కోతకు ద్రవ్యోల్బణమే అడ్డంకి
ABN , First Publish Date - 2020-10-24T07:25:01+05:30 IST
దేశంలో ద్రవ్యోల్బణ ధోరణుల ఆధారంగానే భవిష్యత్తులో పాలసీ రేట్ల కోత ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్బీఐకి నిర్దేశించిన పరిధి (2 శాతం ఎగుడు దిగుడుల వెసులుబాటుతో 4 శాతం) కన్నా చాలా ఎక్కువగా ఉంది...
- ఆర్బీఐ ఎంపీసీ తీర్మానాల్లో స్పష్టీకరణ
ముంబై: దేశంలో ద్రవ్యోల్బణ ధోరణుల ఆధారంగానే భవిష్యత్తులో పాలసీ రేట్ల కోత ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్బీఐకి నిర్దేశించిన పరిధి (2 శాతం ఎగుడు దిగుడుల వెసులుబాటుతో 4 శాతం) కన్నా చాలా ఎక్కువగా ఉంది. పాలసీ రేట్ల కోతకు అవకాశం ఉన్నప్పటికీ దాన్ని న్యాయబద్ధంగా వాడుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడినట్టు ఇటీవల జరిగిన ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం తీర్మానాల ద్వారా తెలుస్తోంది. పునర్ వ్యవస్థీకరించిన ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ఈ నెల 7-9 తేదీల మధ్యన జరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న కారణంగా రెపోరేట్లలో ఎలాంటి మార్పు చేయరాదని ఆ సమావేశం నిర్ణయించింది. మొదటి త్రైమాసికంలో కరోనా ప్రభావం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయి వృద్ధిరేటు గణనీయంగా క్షీణించినప్పటికీ రెండో త్రైమాసికంలో కొన్ని సానుకూలతలు కనిపిస్తున్నాయని దాస్ ఈ సందర్భంగా చెప్పారు. అదే సమయంలో వృద్ధిరేటు మరింత క్షీణించే ప్రమాదం కూడా ఇంకా దాటిపోలేదని కూడా స్పష్టం చేశారు. కరోనా కేసులు రెండో విడత పెరిగే ప్రమాదం పొంచి ఉండడంతో పాటు ప్రైవేటు పెట్టుబడుల తగ్గుదల ఆర్థిక రంగానికి సవాళ్లని దాస్ అన్నారు.