క్రిమి సంబంధ రోగాలు
ABN , First Publish Date - 2021-06-08T16:51:59+05:30 IST
ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ మొదలైన సూక్ష్మక్రిములు మన శరీరం మీద దాడి చేసినప్పుడు ఇన్ఫెక్షన్లతో, వాటి విష ప్రభావంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటికి సంబంధించిన
ఆంధ్రజ్యోతి(08-06-2021)
ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ మొదలైన సూక్ష్మక్రిములు మన శరీరం మీద దాడి చేసినప్పుడు ఇన్ఫెక్షన్లతో, వాటి విష ప్రభావంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటికి సంబంధించిన ఆయుర్వేద చికిత్సల్లో మహాసుదర్శన, పునర్నవాస ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి రక్తశుద్ధితో పాటు, వ్యాధినిరోధకశక్తి పెంచడానికి తోడ్పడతాయి.
మహాసుదర్శన రోగనిరోధకశక్తిని పెంచడంతో పాటు జ్వరాన్ని హరిస్తుంది. జ్వరంతో కూడిన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కామెర్లు, రక్తలేమితోపాటు సాధారణ జలుబు, దగ్గు, ప్రమేహ, భ్రమ, కాస, శ్వాస, పాండు, హృద్రోగ, కామల మొదలైన రోగాలకు ఔషధంగా పని చేస్తుంది. ప్లీహం, కాలేయం సంబంధిత రోగాలకు ఇది అనుపానంగా పని చేస్తుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, మానసిక రుగ్మతలు, భయాలకు కూడా ఉపయోగపడుతుంది.
పునర్నవ తయారీ, ఉపయోగాల గురించి బైషజ్య రత్నావళి గ్రంథంలో శోథరోగాది చికిత్సాప్రకరణ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇది రక్తశుద్ధి, రక్తవృద్ధి, శరీరం నీరు పట్టడం, కాళ్ల వాపులు, నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి, పాము కాటుకు వేరే మందులతో కలిపి ఇవ్వవచ్చు. శరీరం నీరు పట్టడం మూలంగా తలెత్తే ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా రక్తంలో ఇన్ఫెక్షన్కు విశేషంగా ఉపయోగపడుతుంది. క్రిముల వల్ల కలిగే విష ప్రభావం నుంచి ఈ ఔషధంతో ఉపశమనం దక్కుతుంది.
తులసితో చేసిన అరకు, మరికొన్ని మూలికలు కలిపి కంట్లో చుక్కలు వేయడం ద్వారా నుదురు, కళ్లు, ముక్కు, గొంతు మొదలైన ప్రాంతాల్లో ఉండే కఫం బయటకు వచ్చి, శ్వాస తేలికవుతుంది. గృహ వైద్యంగా శ్వాస సంబంధమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం చూర్ణం 3 తులాలు, 20 తులాల నీళ్లతో కలిపి ఆ నీళ్లతో కళ్లను కడిగితే, కళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి.
జి. శశిధర్,
అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,
సనాతన జీవన్ ట్రస్ట్, కొత్తపేట, చీరాల.