సార్థకత లేని సంక్షేమ మండలి

ABN , First Publish Date - 2020-09-01T06:21:56+05:30 IST

ఆంధ్రరాష్ట్రంలో కార్మిక శాఖ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 20 లక్షల పై చిలుకు గుర్తింపు పొందిన భవన నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారు...

సార్థకత లేని సంక్షేమ మండలి

ఆంధ్రరాష్ట్రంలో కార్మిక శాఖ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 20 లక్షల   పై చిలుకు గుర్తింపు పొందిన భవన నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారు. గుర్తింపు లేని వారి సంఖ్య గుర్తింపు ఉన్న సంఖ్య కంటే రెండు మూడు రెట్లు అధికంగా ఉంటుంది. తాపీపనివారు మాత్రమే కాక భవన నిర్మాణ రంగానికి అవసరమయ్యే 57 రకాల వృత్తుల వారు కూడా ఈ రంగం కిందకే వస్తారు. భవన నిర్మాణ కార్మికుల కోసం కార్మిక సంఘాలు సుదీర్ఘ కాలం పోరాటం చేశాయి. పోరాట ఫలితంగా భవన, ఇతర నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా భవన నిర్మాణ సంక్షేమ మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


ఆ సంక్షేమ మండలికి భవన నిర్మాణాలు చేసే యజమానులు, భవన నిర్మాణ విలువలో ఒక్క శాతం సెస్‌ సంక్షేమ మండలికి కార్మికుల సంక్షేమం కోసం చెల్లిస్తున్నారు. ఆ విధంగా కార్మిక సంక్షేమ మండలికి ఇప్పటివరకు దాదాపు రూ.1000కోట్లకు పైగా నిధులు సమకూరాయి. అయినా భవన నిర్మాణ రంగ కార్మికులకు కరోనాతో ఉపాధి లేక బక్కచిక్కిన కార్మికులకు సంక్షేమ నిధి ద్వారా ఎటువంటి ఉపశమనం లభించలేదు. సంక్షేమ మండలిలో కార్మికులకు సంబంధించిన డబ్బు అందులో నిల్వ ఉండి కూడా కార్మికులకు ప్రయోజనం జరగ లేదు. ప్రభుత్వం భవన నిర్మాణ రంగం కార్మికుల శ్రేయస్సు గురించి ఆలోచించాలి. ఇసుక పాలసీని సులభ మార్గంలో అందు బాటులోకి తీసుకువచ్చి పనులు కల్పించాలి. అదే  విధంగా కార్మికశాఖ వద్ద ఇప్పటివరకు నమోదు చేసుకొని ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మికునికి పరిహారం, ఇతర సంక్షేమ పథకాలు కూడా అందిస్తే భవన నిర్మాణ సంక్షేమ మండలికి సార్థకత చేకూరుతుంది.

యస్. శంకరాంజనేయులు, అనంతపురం

Updated Date - 2020-09-01T06:21:56+05:30 IST