INDvsSA: భారీ స్కోర్ చేసిన టీమిండియా.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2022-06-10T02:22:20+05:30 IST

టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల భారీ లక్ష్యాన్ని..

INDvsSA: భారీ స్కోర్ చేసిన టీమిండియా.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..

న్యూఢిల్లీ: టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల భారీ లక్ష్యాన్ని సఫారీల ముందు ఉంచింది. ఓపెనర్లు రుత్‌రాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషాన్ టీమిండియా జట్టుకు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్ కోల్పోయే సమయానికి టీమిండియా 57 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 76 పరుగులు చేసి బ్యాట్‌కు గట్టిగానే పని చెప్పాడు. మూడు సిక్సులు, 11 ఫోర్లతో సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే.. మహరాజ్ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్‌గా దొరికి ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మూడు సిక్స్‌లతో దూకుడుగా ఆడినా పర్నెల్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాకు క్యాచ్‌గా చిక్కి 23 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత.. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ నిలకడగా ఆడి జట్టుకు మంచి స్కోర్‌ను అందించడంలో తమ వంతు పాత్ర పోషించారు. 


శ్రేయాస్ అయ్యర్ 27 బంతుల్లో 36 పరుగులు, పంత్ 16 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో హార్థిక్ పాండ్యా చిచ్చరపిడుగులా విరుచుకుపడ్డాడు. 12 బంతుల్లో 3 సిక్సులు, 2 ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ లేకపోయినప్పటికీ టీమిండియా బ్యాట్స్‌మెన్స్ జట్టుకు మంచి స్కోరే అందించారు. బౌలర్లు కూడా రాణిస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం నల్లేరు మీద నడకే అని చెప్పొచ్చు. సౌతాఫ్రికా టీంను కూడా అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. క్వింటన్ డీ కాక్, మిల్లర్, బవుమా లాంటి హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. 

Updated Date - 2022-06-10T02:22:20+05:30 IST