క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్‌

ABN , First Publish Date - 2022-01-21T08:55:05+05:30 IST

సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో టాప్‌ సీడ్‌ పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు

క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్‌

లఖ్‌నవూ: సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో టాప్‌ సీడ్‌ పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో సింధు 21-16, 21-13తో లారెన్‌ లామ్‌ (అమెరికా)పై సునాయాసంగా నెగ్గి ముందంజ వేసింది. తొలి గేమ్‌ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన సింధు ప్రత్యర్థికి ఏ దశలోనూ ఆధిక్యం ఇవ్వకుండా చెలరేగింది. మొత్తంగా 33 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన  సింధు క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌ షట్లర్‌ సుపనిడా కతేథాంగ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గతవారం జరిగిన ఇండియా ఓపెన్‌ సెమీస్‌లో సుపనిడా చేతిలోనే ఓటమి పాలైన సింధు దానికి బదులు తీర్చుకోవాలని ఎదురు చూస్తోంది. పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ ప్రణయ్‌ 21-11, 16-21, 21-18తో భారత్‌కే చెందిన ప్రియాంశుపై పోరాడి గెలిచాడు. పురుషుల డబుల్స్‌లో తెలుగు కుర్రాళ్లు కృష్ణ ప్రసాద్‌-విష్ణువర్దన్‌ గౌడ్‌ ద్వయం 15-21, 21-17, 21-8తో నూర్‌ మహ్మద్‌-లిమ్‌ కిమ్‌ (మలేసియా)పై నెగ్గగా, మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీ 21-12, 21-7తో సిమ్రాన్‌-రితికాపై గెలిచి ముందంజ వేసింది.

Updated Date - 2022-01-21T08:55:05+05:30 IST