సింధు, కశ్యప్‌ ముందంజ

ABN , First Publish Date - 2022-06-30T08:53:08+05:30 IST

సింధు, కశ్యప్‌ ముందంజ

సింధు, కశ్యప్‌ ముందంజ

మలేసియా ఓపెన్‌లో సైనాకు నిరాశ

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో బుధవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు రెండోరౌండ్‌కు దూసుకెళ్లగా.. మరో ఏస్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ మాత్రం ఆరంభరౌండ్లోనే ఓటమిపాలై ఇంటిబాట పట్టింది. మరోవైపు సైనా భర్త పారుపల్లి కశ్యప్‌ టోర్నీలో శుభారంభం చేశాడు. మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్లో సింధు 21-13, 21-17తో థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ పదో ర్యాంకర్‌ పోర్న్‌పవీ చోచువాంగ్‌ను వరుస గేముల్లో చిత్తుచేసింది. పురుషుల సింగిల్స్‌లో కామన్వెల్త్‌ క్రీడల మాజీ చాంపియన్‌ కశ్యప్‌ 21-12, 21-17తో కొరియాకు చెందిన హే క్వాంగ్‌ హీని ఓడించి రెండోరౌండ్లో కున్లావత్‌ విటిడాసర్న్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. మరోసారి తన ఫామ్‌లేమిని చాటుకుంటూ లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా 11-21, 17-21తో ప్రపంచ 33వ ర్యాంకర్‌ ఇరిస్‌ వాంగ్‌ (అమెరికా) చేతిలో దారుణ ఓటమిని మూట గట్టుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమిత్‌ రెడ్డి-అశ్వినీ పొన్నప్ప జోడీ 15-21, 21-19, 17-21తో నెదర్లాండ్స్‌ ద్వయం రాబిన్‌ టాబెలింగ్‌-సెరెనా పీక్‌ చేతిలో పరాజయంపాలైంది. 

Updated Date - 2022-06-30T08:53:08+05:30 IST