ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2020-08-03T09:34:46+05:30 IST

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ దేవాలయంలో శ్రావణ మాస పవిత్రోత్సవాలు ఆదివారం ..

ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

ఆంధ్రజ్యోతి, విజయవాడ: అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ దేవాలయంలో శ్రావణ మాస పవిత్రోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఉదకశాంతి చేశారు. ఆ ఉదకశాంతి కుంభంతో ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి అభ్యంగన స్నానం, స్నపనాభిషేకం, ప్రాతఃకాలార్చన, అగ్నిప్రతిష్ఠాపన, అఖండ దీపస్థాపన కార్యక్రమాలను వేదపండితులు  నిర్వహించారు.


108 పోగులు, 108 ముళ్లు కలిగిన పట్టు పవిత్రాలను అమ్మవారికి, ఆలయంలోని ఇతర ఉత్సవ మూర్తులకు ధారణ చేశారు. ఆ తర్వాత ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈనెల 4వ తేదీ వరకు పవిత్రోత్సవాలు కొనసాగుతాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. ఆలయంలో జరిగే సర్వ వైదిక క్రతువులు, ఉత్సవాలు సంపూర్ణ ఫలితాలను ఇవ్వాలని, సర్వదోషాల నివారణ కోసం ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. దేవాలయ ఆగమ నియమ నిబంధనల మేరకు వీటిని ఏటా నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఆలయ శుద్ధి కోసం నిర్వహించే పవిత్రోత్సవాల్లో ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశారు. ఐదో తేదీ నుంచి ఆర్జిత సేవలు జరుగుతాయని దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ తెలిపారు. 

Updated Date - 2020-08-03T09:34:46+05:30 IST