ఆరు నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్.. ఇండోనేషియా కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-12-13T23:33:37+05:30 IST

చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌పై ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నుంచి 11 ఏళ్ల లోపు

ఆరు నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్.. ఇండోనేషియా కీలక ప్రకటన

జకార్తా: చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌పై ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు రేపటి (డిసెంబరు 14) నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దశల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ మాక్సీ రీన్ రోండోనువు తెలిపారు. తొలి దశలో ప్రావిన్సులు, జిల్లాలు, నగరాల్లో వేస్తామన్నారు.  


చైనాకు చెందిన సోనోవ్యాక్‌ టీకాను ఇండోనేషియా పంపిణీ చేయనుంది. దీనికి అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ) లభించింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి మొత్తం 6.4 మిలియన్ డోసులను పూర్తిగా వినియోగించాలని నిర్ణయించినట్టు ఇండోనేషియా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వచ్చే ఏడాది మొదటి నుంచి నాన్-సినోవ్యాక్ వ్యాక్సిన్లను పెద్దలకు ఇస్తామని, చిన్నారులకు మాత్రం సినోవ్యాక్ వ్యాక్సిన్లను మాత్రమే వేస్తామని మాక్సీ రీన్ తెలిపారు.  


ఇండోనేషియాలో ఇప్పటి వరకు 4.2 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఆసియాలో చైనా ఇప్పటికే మూడేళ్లు దాటిన చిన్నారులకు వ్యాక్సిన్ ఇస్తోంది. కాంబోడియాలో ఆరు నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేస్తున్నారు. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు ఈ ఏడాది ముగిసేలోపు వ్యాక్సిన్లు వేస్తామని గతవారం సింగపూర్ ప్రకటించింది.

Updated Date - 2021-12-13T23:33:37+05:30 IST