భారత్-చైనా సైనిక కమాండర్ల స్థాయి చర్చలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-12T18:48:12+05:30 IST

భారత్-చైనా సీనియర్ మిలిటరీ కమాండర్ల స్థాయి 14వ విడత

భారత్-చైనా సైనిక కమాండర్ల స్థాయి చర్చలు ప్రారంభం

న్యూఢిల్లీ : భారత్-చైనా సీనియర్ మిలిటరీ కమాండర్ల స్థాయి 14వ విడత చర్చలు బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. చూసుల్-మోల్డో వద్ద ఈ సమావేశం జరుగుతోంది. తూర్పు లడఖ్‌లోని ఘర్షణ ప్రదేశాల సమస్య పరిష్కారమయ్యేందుకు నిర్మాణాత్మక చర్చలు జరుగుతాయని భారత దేశం ఆశిస్తోంది. ఘర్షణ ప్రాంతాల నుంచి చైనా సైన్యం ఉపసంహరణ కోసం, అదే విధంగా డెప్సాంగ్ బల్జ్, దెమ్‌చోక్ సమస్యల పరిష్కారంపై  భారతీయ కమాండర్లు పట్టుబడతారని తెలుస్తోంది. 


2021 అక్టోబరు 10న 13వ విడత చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారతీయ కమాండర్లు చేసిన సూచనలను చైనా అంగీకరించలేదు. దీంతో ఎటువంటి ఫలితాన్ని సాధించకుండానే ఈ చర్చలు ముగిశాయి. దీంతో నవంబరులో వర్చువల్ డిప్లమేటిక్ చర్చలు జరిగాయి. తూర్పు లడఖ్‌లోని ఘర్షణ ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించడంపై సాధ్యమైనంత త్వరగా 14వ విడత చర్చలు జరపాలని భారత్, చైనా అంగీకరించాయి. 


14వ విడత చర్చల కోసం భారత దేశం ఈ రెండు నెలల్లో రెండు ప్రతిపాదనలను పంపిందని, అయితే ఇప్పటి వరకు చైనా ఈ ప్రతిపాదనలపై స్పందించలేదని సమాచారం. 


తూర్పు లడఖ్‌ వద్ద భారత్-చైనా సరిహద్దుల్లో 2020 మే 5 నుంచి ప్రతిష్టంభన కొనసాగుతోంది. పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు పరస్పరం తలపడిన సంగతి తెలిసిందే. చైనా పెద్ద ఎత్తున సైన్యాన్ని, ఆయుధాలను మోహరించడంతో భారత దేశం కూడా తన దళాలను పెంచింది. 


ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్యపరమైన చర్చలు అనేక దఫాల్లో జరిగిన తర్వాత పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లోని దళాలను, గోగ్రా ప్రాంతంలోని దళాలను ఇరు దేశాలు ఉపసంహరించుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాలు సుమారుగా చెరొక 60 వేల మంది సైనికులను వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించాయి. 


Updated Date - 2022-01-12T18:48:12+05:30 IST