ఇంటింటికీ మువ్వన్నెల జెండా

ABN , First Publish Date - 2022-08-10T05:20:28+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో స్వర్ణోత్సవ సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాలలో మంగళవారం ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

ఇంటింటికీ మువ్వన్నెల జెండా
మధిరలో పోస్టల్‌ ఉద్యోగుల ర్యాలీ

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ పంపిణీ

థియేటర్లలో ‘గాంధీ’ చిత్రాన్ని వీక్షించిన విద్యార్థులు

ముదిగొండ, ఆగస్టు 9: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో స్వర్ణోత్సవ సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాలలో మంగళవారం ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

ముదిగొండలో..

స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ సామినేని హరిప్రసాద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్‌, తహసీల్దార్‌ దామోదర్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎస్‌ఐ తోట నాగరాజు, సర్పంచ్‌ మందరపు లక్ష్మీ, కార్యదర్శి సంపత్‌ పాల్గొన్నారు.

మధిరలో పోస్టల్‌ శాఖ ఉద్యోగుల తిరంగా ర్యాలీ 

ఆజాదీకా అమృత మహోత్సవాల్లో భాగంగా తపాలా శాఖ ఉద్యోగులు మంగళవారం మధిరలో తిరంగా ర్యాలీ నిర్వహించి జాతీయ జెండాఉత్సవాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. టుటౌన్‌లోని హెడ్‌ పోస్ఠాఫీసు నుంచి ర్యాలీ ప్రారంభమై టుటౌన్‌, వన్‌టౌన్‌లలోని ప్రధాన వీధుల్లో సాగింది. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం గురించి ప్రజల్లో ప్రచారం చేశారు. ఈనెల 13 నుంచి 15వతేదీ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాజీబాబు, పోస్టల్‌ ఉద్యోగులు శివరాజ్‌ శ్రీనివాసరావు, ఆదినారాయణ, నవీన్‌, రాణి, హరీష్‌ పాల్గొన్నారు. 

కొణిజర్లలో

స్వాతంత్య్ర స్వర్ణోత్సవ సంబురాలలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసిన జాతీయ పతాకాలను కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, ఎంపీడీవో రమాదేవి అధికారులకు పంపిణీ చేశారు.

వైరాలో..

 వైరా మునిసిపల్‌, మండల ప్రజాపరిషత్‌ కార్యాలయాల్లో సిబ్బందికి చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ఎంపీడీవో ఎన్‌.వెంకటపతిరాజు జాతీయ జెండాలు అందజేశారు. మునిసిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ జైపాల్‌, కమిషనర్‌ వెంకటపతిరాజు, సీఐ టి.సురేష్‌, ఎస్‌ఐ శాఖమూరి వీరప్రసాద్‌, టీపీవో ఇటుకాల భాస్కర్‌, ఏఈ అనిత, టీఎంసీ బండారుపల్లి వెంకటేశ్వర్లు జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలపరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో వెంకటపతిరాజు జాతీయ జెండాలను అందజేశారు. 

వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపు నిచ్చారు. వేడుకల్లో భాగంగా ఈ నెల 13న వేలాది మందితో నిర్వహించనున్న ప్రదర్శనను విజయవంతం చేయాలని సూచిచారు. మంగళవారం ఆయన స్థానిక మునిసిపాలిటీ కార్యాలయంలో ఇంటింటికీ పంపిణీ చేసే జాతీయ పతాకాలను అధికారులతో కలసి విడుదల చేశారు. అనంతరం వార్డుల్లో ఇంటింటికీ జాతీయ పతాకాలను పంపిణీ ప్రక్రయను ప్రారంభించారు. వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు.

Updated Date - 2022-08-10T05:20:28+05:30 IST