విమానాల్లో ప్రయాణికులకు ఇక భోజనం సప్లయి ఉండదు...

ABN , First Publish Date - 2020-04-10T18:55:03+05:30 IST

దేశంలో కరోనా లాక్‌డౌన్ ఎత్తివేశాక నడిపే విమాన సర్వీసుల్లో ప్రయాణికులకు ఇకపై భోజనం సప్లయి ఉండదని ...

విమానాల్లో ప్రయాణికులకు ఇక భోజనం సప్లయి ఉండదు...

న్యూఢిల్లీ : దేశంలో కరోనా లాక్‌డౌన్ ఎత్తివేశాక నడిపే దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణికులకు ఇకపై భోజనం సప్లయి ఉండదని భారతదేశ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. లాక్‌డౌన్ అనంతరం నడిపే విమానాల మార్గదర్శకాల గురించి ఇండిగో ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోనోజోయ్ దత్తా తన సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 50 శాతం ప్రయాణికులతోనే విమానాలు నడుపుతామని ఆయన ప్రకటించారు. విమానాలు, విమానాశ్రయాల్లో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని దత్తా పేర్కొన్నారు. కరోనా వైరస్ సంక్రమణ గొలుసు విచ్ఛిన్నం అయ్యాక తాము విమానాలు నడుపుతామని దత్తా చెప్పారు.


‘‘మా విమానాలను మరింత బాగా శుభ్రం చేయడంతోపాటు ప్రయాణికులకు భోజన సేవలను నిలిపివేస్తాం...50 శాతం ప్రయాణికులతోనే కొత్త మార్గదర్శకాలతో విమానాలు నడుపుతాం’’అని దత్తా వివరించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త నిబంధనల ప్రకారం విమానాల్లో మధ్య సీటు, చివరి మూడు వరుసలను ఖాళీగా ఉంచుతామని దత్తా చెప్పారు. విమాన ప్రయాణికులకు గేట్ల వద్దనే శానిటైజర్లు అందించాలని నిర్ణయించినట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోనోజోయ్ దత్తా చెప్పారు. విమానాశ్రయాల్లోని విమాన చెక్ ఇన్ కౌంటర్లు, ప్రయాణికుల వెయిటింగ్ ఏరియాలు, భద్రతా తనిఖీలు చేసే ప్రాంతాల్లో ఒక ప్రయాణికుడికి, మరో ప్రయాణికుడికి మధ్య మీటరు దూరం ఉండేలా చూస్తామన్నారు. విమాన క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులకు దూరం నుంచి సేవలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించామని దత్తా పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-10T18:55:03+05:30 IST