వరుసగా 3వ సెషన్లో లాభాలు.. Sensex 400 పాయింట్లు వృద్ధి
ABN , First Publish Date - 2022-06-27T21:57:44+05:30 IST
గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఇటివల భారీ నష్టాల నేపథ్యంలో తక్కువ వ్యాల్యూయేషన్లోనే షేర్ల లభ్యత దన్నుతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడవ సెషన్ సోమవారం లాభాల్లో ముగిశాయి.
ముంబై : గ్లోబల్ మార్కెట్ల(Global Markets) నుంచి సానుకూల సంకేతాలు, ఇటివల భారీ నష్టాల నేపథ్యంలో తక్కువ వ్యాల్యూయేషన్లోనే షేర్ల లభ్యతతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా మారింది. కొనుగోలు దన్నుతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడవ సెషన్ సోమవారం(Monday) లాభాల్లో ముగిశాయి. ఆరంభ లాభాలను ఒడిసిపడుతూ బీఎస్ఈ సెన్సెక్స్(BSE Sensex) 433.30 పాయింట్లు లేదా 0.82 శాతం వృద్ధి చెంది 53,161.28 వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ(NSE Nifty) 132.80 పాయింట్లు లేదా 0.85 శాతం మేర బలపడి 15,832.05 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ప్రత్యేకంగా స్టాకుల విషయానికి వస్తే.. ఓఎన్జీసీ(ONGC), కోలిండియా(Coal India), ఎల్ అండ్ టీ(L and T), హెచ్సీఎల్ టెక్నాలజీస్(HCL Technologies), యూపీఎల్(UPL) షేర్లు నిఫ్టీ-50పై టాప్-5 లాభదార్లుగా నిలిచాయి. కాగా ఐషర్ మోటార్స్(Icher motors), అపోలో హాస్పిటల్స్(appollo hospitals), హెచ్డీఎఫ్సీ లైఫ్(HDFC Life), కోటక్ మహింద్రా బ్యాంక్(Kotak mahindra bank), బ్రిటానియా(Britania) టాప్-5 నష్టదార్లుగా నిలిచాయి. ఈ మేరకు ఎన్ఎస్ఈ డేటా స్పష్టం చేసింది. కాగా ఎన్ఎస్ఈపై అన్ని రంగాల సూచీలు పాజిటివ్గానే ముగిశాయి. అత్యధికంగా నిఫ్టీ ఐటీ సూచీ 2.1 శాతం మేర లాభపడింది.
మార్కెట్ ట్రెండ్పై మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్(టెక్నికల్, ఈక్విటీ డెరివేటివ్స్) చందన్ తపారియా స్పందిస్తూ... స్టాక్స్ తక్కువ స్థాయిల్లో ఉండడంతో మార్కెట్లో సానుకూల ట్రెండ్కు కారణమని విశ్లేషించారు. ప్రస్తుత స్థితిని బట్టి చూస్తే మార్కెట్లు మరింత లాభపడతాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎంపిక చేసిన పలు స్టాకులను కొనుగోలుకు ఇది అనువైన సమయమని చందన్ తపారియా సూచించారు.