India-UK: విమాన ఛార్జీలకు రెక్కలు
ABN , First Publish Date - 2021-08-09T00:53:49+05:30 IST
ఎయిర్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. కొచ్చి ఎయిర్పోర్ట్ - హీత్రో విమానాశ్రయానికి మధ్య విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశంపై స్పష్టత ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సెకెం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. కొచ్చి ఎయిర్పోర్ట్ - హీత్రో విమానాశ్రయానికి మధ్య విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశంపై స్పష్టత ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సెకెండ్ వేవ్ రూంలో కరోనా మహమ్మారి భారత్లో విజృంభించింది. దీంతో కొన్ని ప్రపంచ దేశాలు భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. యూకే సైతం ఇండియాను రెడ్లిస్ట్లో చేర్చింది. ప్రస్తుతం ఇండియాలో పరిస్థితులు కాస్త మెరుగుపడినందున రెడ్లిస్ట్ నుంచి తొలగించి, అంబర్ లిస్ట్లో చేర్చింది. ఈ క్రమంలో కొవిడ్ వ్యాక్సిన్ను పూర్తి స్థాయిలో తీసుకున్న భారత ప్రయాణికులు బ్రిటన్లో 10 రోజులపాటు తప్పనిసరిగా హోటల్ క్వారెంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది. హోం క్వారెంటైన్లో ఉంటే సరిపోతుందని వెల్లడించింది. సవరించిన ఈ ఆంక్షలు ఆగస్ట్ 8 నుంచి అమలులోకి వస్తాయని బ్రిటన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొచ్చి-హీత్రో విమానాశ్రయాల మధ్య ఆగస్టు 18 నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.
భారీగా పెరిగిన టిక్కెట్ ధరలు
భారత ప్రయాణికులకు యూకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్రమంలో విమాన ఛార్జీలు ఆకాశాన్నాంట్టాయి. న్యూఢిలీ నుంచి లండన్ వెళ్లేందుకు సాధారణంగా 55,000-70,000 మధ్య ఖర్చవుతుంది. అయితే ప్రస్తుతం ఈ రూట్లో విమాన ఛార్జీలు లక్ష దాటాయి. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా కూడా స్పష్టం చేసింది. ఢిల్లీ-లండన్ రూట్లో ప్రయాణించేందుకు రూ.1.15లక్షలు వెచ్చించాల్సిందే అని పేర్కొంది. కాగా.. డిమాండ్కు అనుగుణంగా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు అందుబాటులో లేకపోవడమే ఛార్జీలు విపరీతంగా పెరగడానికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వారానికి 30 విమానాలు మాత్రమే అందుబాటులోకి ఉన్నాయి.